హైదరాబాద్: మహా కూటమిలో సర్దుకుపోదామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని సీపీఐ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. నాలుగో సీటు కోసం ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. దేవరకొండ లేదా ఆలేరు సీటు ప్రయత్నిస్తున్నామని అన్నారు. రేపు(బుధవారం) మూడు స్థానాల్లో నామినేషన్ పత్రాలను మా అభ్యర్థులు దాఖలు చేస్తారని వెల్లడించారు.
హుస్నాబాద్లో చాడ వెంకట్ రెడ్డి, బెల్లంపల్లిలో ఎం. మల్లేష్, వైరాలో డాక్టర్ విజయ పోటీ చేస్తారని వివరించారు. ఉమ్మడి కార్యాచరణతో ఎన్నికల ప్రచారంలో కలిసి ముందుకు పోతామని వ్యాఖ్యానించారు. మహా కూటమి మధ్య స్నేహపూర్వక, రెబెల్ పోటీలు ఉండకూడదన్నారు. మునుగోడు సీటు కోసం కూడా ప్రయత్నించామని తెలిపారు.