సామాజిక ఐక్యతను దెబ్బతీసే కుట్ర

16 Jul, 2018 02:19 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఏచూరి. చిత్రంలో తమ్మినేని, నల్ల, కంచ ఐలయ్య

దేశభక్తి పేరిట పెరుగుతోన్న దాడులు

ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోన్న బీజేపీ

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

హైదరాబాద్‌: తెలంగాణలో బహుజన ప్రభుత్వం వస్తుందని, ఇప్పుడు ఏర్పడకుంటే అది నినాదంగానే మిగులుతుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచి సామాజిక ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. దేశభక్తి పేరుతో దళితులు, మైనార్టీ లు, రాజ్యాంగ సంస్థల మీద దాడులు చేసి ఆ సంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లను నింపి దేశచరిత్ర, ప్రజాస్వామ్య పునాదులను పెకిలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో ఎన్నికల సంస్కరణల ఆవశ్యకత– బహుజన ప్రభుత్వం ఓటర్‌ పాత్ర అనే అంశంపై ఆదివారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీని గద్దె దించకపోతే దేశ భవిష్యత్‌ దెబ్బతింటుందన్నారు. ప్రజాస్వామ్య హక్కులను బీజేపీ కాలరాస్తోందన్నారు.  బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే వెనుకబాటుతనం పోతుందన్నారు. బీజేపీకి అనుకూలంగా ఓటుపడేలా ఈవీఎంల తయారీలో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. 

వేలాది ఎకరాలు ఆక్రమణ: తమ్మినేని 
ఎర్ర జెండాల ఐక్యతకు బీఎల్‌ఎఫ్‌ కట్టుబడి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నా రు. హైదరాబాద్‌లో వేలాది ఎకరాల భూములు ఆక్ర మణకు గురయ్యాయని విమర్శించారు. బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర చైర్మన్‌ నల్ల సూర్యప్రకాశ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కంచ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు