సీపీఎస్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీకి బంపర్‌ మెజారిటీ!

19 May, 2019 18:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌ (సీపీఎస్‌) పోస్ట్‌ పోల్‌ సర్వే అంచనా వేసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ 133-135 స్థానాలను గెలుపొందనుందని, అధికార టీడీపీ కేవలం 37 నుంచి 40 సీట్లు మాత్రమే విజయం సాధిస్తుందని సీపీఎస్‌ సర్వే వెల్లడించింది. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ  సున్నా లేదా ఒక్క స్థానం గెలిచే అవకాశముందని, ఐదు స్థానాల్లో హోరాహోరీ పోటీ నెలకొని ఉంటుందని పేర్కొంది. వైఎస్సార్‌సీపీకి 50.1% శాతం ఓట్లు వస్తాయని, టీడీపీకి 40.2% శాతం ఓట్లు, జనసేనకు 7.3% శాతం ఓట్లు, ఇతరులకు 2.6% శాతం ఓట్లు వస్తాయని సీపీఎస్‌ వెల్లడించింది..

పోస్ట్‌ పోల్‌ సర్వే ప్రకారం పార్టీల వారీగా ఓట్ల శాతం
వైఎస్సార్సీపీ టీడీపీ జనసేన ఇతరులు
50.1% 40.2% 7.3% 2.6%
పోస్ట్‌ పోల్‌ సర్వే ప్రకారం పార్టీల వారీగా సీట్లు
వైఎస్సార్సీపీ టీడీపీ జనసేన హోరాహోరీ సీట్లు
133 - 135 37 - 40 0 - 1 5

ఆ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలోను ఇంచుమించుగా ఇదే ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీకి 130 నుంచి 133 స్థానాలు, టీడీపీకి 43 నుంచి 44 స్థానాలు వస్తాయని, జనసేనకు సున్నా నుంచి ఒక్క స్థానం వస్తుందని పేర్కొంది.

ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ప్రకారం పార్టీల వారీగా ఓట్ల శాతం
వైఎస్సార్సీపీ టీడీపీ జనసేన ఇతరులు
50.1% 40.2% 7.3% 2.6%
ఎగ్జిట్‌ సర్వే ప్రకారం పార్టీల వారీగా సీట్లు
వైఎస్సార్సీపీ టీడీపీ జనసేన
130 - 133 43-44 0 - 1

తమ సంస్థ 2006 నుంచి ప్రీపోల్స్‌ సర్వేలు నిర్వహిస్తోందని, 2009లో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపైనా తాము సర్వే నిర్వహించామని సీపీఎస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 88 నుంచి 90 స్థానాలు వస్తాయని తాము అంచనా వేశామని, తమ అంచనా నిజమై టీఆర్‌ఎస్‌కు 88 స్థానాలు వచ్చాయని, అదేవిధంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 98 నుంచి 100 స్థానాలు వస్తాయని తాము పేర్కొనగా.. ఆ పార్టీకి 99 స్థానాలు వచ్చాయని తెలిపింది. ఇక, గతంలో 2009 ఏపీ ఎన్నికల్లో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీకి 159 సీట్లు వస్తాయని పేర్కొనగా.. ఆ పార్టీకి 156 సీట్లు వచ్చాయని వివరించింది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
సీపీఎస్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీకి భారీ మెజారిటీ!

మరిన్ని వార్తలు