ఓటమిపై చర్చించిన సీడబ్ల్యూసీ

25 May, 2019 12:23 IST|Sakshi

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపై కారణాలను విశ్లేషించుకునేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) శనివారం భేటీ అయ్యింది. ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, మల్లికార్జున్‌ ఖర్గే, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌, షీలా దీక్షిత్‌ తదితరులు హాజరయ్యారు.

లోకసభ ఎన్నికల్లో ఓటమికి, మరీ ముఖ్యంగా అమేథీలో ఓటమికి పూర్తి బాధ్యత తనదే అని రాహుల్‌ గాంధీ ఈ సమావేశంలో ప్రకటించారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) తిరస్కరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. దాంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు తమ పదవికి రాజీనామా చేశారు.

మరిన్ని వార్తలు