మాట్లాడేందుకే వచ్చా.. కాంగ్రెస్‌లో చేరలేదు 

28 Oct, 2018 02:55 IST|Sakshi

     రాహుల్‌గాంధీని కలసిన అనంతరం డీఎస్‌ 

     ఏం మాట్లాడానో ఎందుకు చెప్పాలంటూ ఎదురు ప్రశ్న 

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, మాజీ పీసీసీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌ శనివారం ఢిల్లీలో రాహుల్‌ గాంధీని కలిశారు. రాహుల్‌ నివాసంలో సుమారు అరగంటకు పైగా సమావేశం జరిగింది. అనంతరం బయటకొచ్చిన డీఎస్‌ను మీడియా ప్రతినిధులు కలసి రాహుల్‌తో సమావేశ వివరాలు ఏంటని ప్రశ్నించగా.. రాహుల్‌తో ఏం మాట్లాడానన్నది మీకెందుకు చెప్పాలంటూ ఎదురు ప్రశ్నించారు. తాను ఎంతో మందిని కలుస్తుంటానని, అవన్ని చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

డీఎస్‌ తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోందని ప్రశ్నించగా.. తాను కాంగ్రెస్‌లో చేరలేదని, కేవలం రాహుల్‌తో మాట్లాడేందుకు వచ్చానని సమాధానమిచ్చారు. అయితే నర్సారెడ్డి, రాములునాయక్‌ కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ఆర్సీ కుంతియా మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధనలో కలసి పనిచేసేందుకు డి.శ్రీనివాస్‌ రాహుల్‌ను కలసి మాట్లాడారని చెప్పారు. కాగా, సాయంత్రం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ డీఎస్‌ సమావేశమయ్యారు.

మరిన్ని వార్తలు