అక్కడ తిడతారు.. ఇక్కడ వాటేసుకుంటారు

30 Nov, 2018 09:48 IST|Sakshi
దగ్గుబాటి పురందేశ్వరి

ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ నేత పురందేశ్వరి ధ్వజం

సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సత్తుపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీలో కాంగ్రెస్‌ పార్టీని తిట్టి.. తెలంగాణలో మాత్రం రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీని వాటేసుకుంటున్నారని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. గురువారం ఆమె ఖమ్మం, సత్తుపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు ఒకే వేదికపై కూర్చొని దేశానికి విపత్తు వచ్చిందంటున్నారని, ఆ విపత్తు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. భావసారూప్యత లేని కాంగ్రెస్, టీడీపీల పొత్తు అనైతికమని, ప్రజలు ఆ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆరోపించారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే స్వచ్ఛమైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు. సిద్ధాంతం లేని కూటమిలోని పార్టీలు సుపరిపాలన ఎలా అందిస్తాయని పురందేశ్వరి ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నేడు అదే కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. అపవిత్ర పొత్తుతో ప్రజలను ఎలా ఓట్లు అడుగుతారన్నారు. బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వారిపైనే ఈడీ దాడులు చేస్తోందని, ఆ దాడుల్లో ఎవరి ప్రమేయం ఉండదన్నారు.

మరిన్ని వార్తలు