‘ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలి’

20 Feb, 2019 19:29 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : ‘మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలు’ అంటూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే చింతమనేనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, రాజకీయ నాయకులు నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలకు దిగారు. పీవీ రావు మాల మహానాడు రాష్ట్రాధ్యక్షుడు గుమ్మారపు సూర్యవరప్రసాద్‌ ఆధ్వర్యంలో పాలకొల్లులోని గాంధీ బొమ్మల సెంటర్లో బుధవారం రాస్తారోకో చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి చింతమనేనిపై కేసు నమోదు చేయాలని సీఐ ఆదిప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. అనతరం మీడియాతో మాట్లాడారు. (మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు)

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం..
దళిత వ్యతిరేకి, కుల అహంకారి అయిన ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చెయ్యాలి. దళిత జాతిని కించపరస్తూ.. మీకు పదవులు ఎందుకు రా.. అని ఎమ్మెల్యే మాట్లాడటం చాలా హేయమైన చర్య. చింతమనేనిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలి. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం’ అని దళిత నాయకులు  హెచ్చరించారు.

‘ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారేం శివాజీ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ దళితులపట్ల ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండించక పోవడం చాలా సిగ్గు చేటు. మాపై నిజమైన ప్రేమ ఉంటే కారెం శివాజీ, జూపూడి లిద్దరూ కూడా తక్షణమే తమ పదవులకి రాజీనామా చేయడంతో పాటు టీడీపీని వీడి బయటకు రావాలి’ అని సూర్యవరప్రసాద్‌ డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు