బాబు పాలనలో దళితులకు రక్షణ కరువు

10 May, 2018 03:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో దళితులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని, చట్టాలు, రాజ్యాంగ వ్యవస్థలకు చంద్రబాబు సర్కారు తూట్లు పొడుస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దౌర్జన్యాల నుంచి రాష్ట్ర ప్రజల్ని అంబేడ్కరే రక్షించాలన్నారు. టీడీపీ హయాంలో దళితులపై దాడులు అధికమయ్యాయని పేర్కొన్నారు.

దళితులుగా ఎవరైనా పుడతారా? అని అవమానకరంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ‘‘గరగపర్రులో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశారని దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో చనిపోయిన పశువు చర్మం ఒలిచారని చెట్టుకు కట్టేసి కొట్టారు. కుప్పంలో దళిత మహిళను వివస్త్రను చేశారు. కర్నూలు జిల్లాలో పారిశుద్ధ్య పనులు చేయలేదని గ్రామ బహిష్కరణ చేశారు. ప్రకాశం జిల్లాలో దళితుల భూముల్ని ఆక్రమించుకున్నారు’’ అని గుర్తు చేశారు. 

మరిన్ని వార్తలు