ప్రభుత్వ విధానాల వల్లే ఆర్టీసీకి నష్టం

27 May, 2018 00:58 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న చాడ, జూలకంటి, కోదండరాం తదితరులు

జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం

హైదరాబాద్‌: ప్రభుత్వం అనుసరిస్తున్న విధి, విధానాల వల్లే ఆర్టీసీ నష్టాల బాటలో పయనిస్తుందని జనసమితి పార్టీ  అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. నష్టాలు ఎందుకు వస్తున్నాయన్న విషయాలపై చర్చించకుండా ఆర్టీసీ కార్మికుల వల్లే నష్టాలు వస్తున్నాయనడం భావ్యం కాదన్నారు. టీఎస్‌ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్యర్యంలో శనివారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో ‘ఆర్టీసీ పరిరక్షణ– కార్మికుల వేతన ఒప్పందం– ప్రభుత్వ వైఖరి’ అనే అంశాలపై పలు రాజకీయ పార్టీల నేతలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.  

కోదండరాం మాట్లాడుతూ ఆర్టీసీ రకరకాల కారణాలతో నష్టపోతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. భారం మోస్తున్న కార్మికుల వల్లే నష్టాలు అనడం బాధగా ఉందన్నారు.  ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్‌సీ ఇవ్వక 14 నెలలు గడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రైవే టుపరం చేసేందుకు పావులు కదపడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్‌  పద్ధతి మార్చుకోవాలని టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ సేవారంగమైన ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధి కార ప్రతినిధి సుధీర్‌రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు