వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేరుస్తాం

8 Oct, 2018 01:08 IST|Sakshi

దామోదర రాజనర్సింహ

పటాన్‌చెరు: వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఔటర్‌ రింగ్‌రోడ్డు శివారులోని ముత్తంగి గ్రామ పరిధిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వడ్డెర లక్ష్య సాధన ఆత్మ గౌరవ సభ కు దామోదరతో పాటు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ వడ్డెరలకు న్యాయం చేస్తుందని దామోదర హామీ ఇచ్చారు.

2 అసెంబ్లీ స్థానాలు కేటాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. 1976కు ముందు వడ్డెరలకు డీఎన్‌టీ (డీనోటిఫైడ్‌ ట్రైబ్స్‌) రిజర్వేషన్‌ అమల్లో ఉండేదని, ఆ విధానంతో పాటు ఎస్టీ జాబితాలో ఆ కులాన్ని చేర్చే అంశంపై కాంగ్రెస్‌ మద్దతు ఉంటుందన్నారు.    సమాజంలో అత్యంత వెనుకబడిన కులంగా వడ్డెరలు ఉన్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎర్రటి ఎండలో బండలను, కొండలను పిండి చేసే వారు తమ సంపాదనలో సగం వరకు బెల్టు షాపులకే వెచ్చిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బండలు కొట్టే వారి భవిష్యత్‌ తరతరాలు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు