కుట్రపూరితంగానే అరెస్టులు

12 Sep, 2018 02:28 IST|Sakshi

మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహ

పటాన్‌చెరు టౌన్‌/ సంగారెడ్డి టౌన్‌/ పుల్‌కల్‌: ప్రభుత్వం కుట్ర పూరితంగానే తమ పార్టీ నేతలపై  కేసులు బనాయించి రాజకీయంగా దెబ్బ తీయాలనుకుంటోందని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. హైదరాబాద్‌ నుంచి మం గళవారం సంగారెడ్డి వెళ్తున్న ఆయనను పటాన్‌చెరు మండలం ముత్తంగి టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అరెస్టు చేసి బీడీఎల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.  రాజనర్సింహ మాట్లాడుతూ తోటి రాజకీయ నేత జగ్గారెడ్డిని అరెస్టు చేయడంతో కుటుంబసభ్యులను పరామర్శించడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారన్నారు. ప్రభుత్వం కక్షగట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు.

ప్రభుత్వమే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పోలీసు యంత్రగాన్ని వాడుకుంటూ తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో జగ్గారెడ్డి పాస్‌పోర్టు అంశం గుర్తుకురానిది ఇప్పుడు గుర్తుకురావడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అయ్యప్ప సొసైటీ, మియాపూర్‌ భూ కుంభకోణం వంటివి బయటకు రాకుండా వారి నేతలను కాపాడుకుంటూ   ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. జగ్గారెడ్డి అరెస్టును కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని మాజీమంత్రి, ఉమ్మడి మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జయప్రకాశ్‌రెడ్డిని పరామర్శించడానికి వచ్చి న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు