టికెట్‌పై సస్పెన్స్‌: ఎట్టకేలకు మౌనం వీడిన దానం

10 Sep, 2018 15:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్‌ నేత దానం నాగేందర్‌కు గులాబీ అధినేత కేసీఆర్‌ ఇంకా టికెట్‌ ఖరారు చేయని సంగతి తెలిసిందే. దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండగా.. గోషామహల్‌ నుంచి పోటీచేయాల్సిందిగా ఆయనను టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆదేశించినట్టు కథనాలు వస్తున్నాయి. టికెట్‌ ఖరారు చేయకపోవడంతో దానం అసంతృప్తిగా ఉన్నారని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ఎట్టకేలకు మౌనం వీడారు. తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న కథనాలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.

తనకు టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని దానం చెప్పారు. పార్టీ మారాలనుకున్న నాయకులు ‘వెళ్ళిపోతే... వెళ్లిపోవాలి’ తప్ప ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌లో కేటీఆర్‌ కోటరీ ఉంది అనడం తప్పు అని మీడియాతో చెప్పారు. తరచూ పార్టీలు మారడానికి తానేమీ గంగిరెద్దును కాదని వ్యాఖ్యానించారు. ఎలాంటి ఒప్పందం లేకుండానే తాను టీఆర్‌ఎస్‌లో చేరానని చెప్పారు.

మరిన్ని వార్తలు