ఒక్క హామీ నెరవేర్చలేదు!: దాసోజు

1 May, 2018 01:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల హామీలను నెరవేర్చలేదం టూ సీఎం కె.చంద్రశేఖర్‌రావుపై టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ కుమార్‌ విరుచుకుపడ్డారు. ఏ హామీ నెరవేర్చారో చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.  సోమవారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు.

‘పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇచ్చారా? దళిత, గిరిజను లకు మూడెకరాల భూమి ఇచ్చారా? గిరిజనులకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చారా? నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలిచ్చారా? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించారా? నిజాం చక్కెర కర్మాగారం, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మిల్లును తెరిపించారా? ఇవేమీ చేయకుండానే అన్నీ చేసేశామని కేసీఆర్‌ అండ్‌ కంపెనీ ప్రగల్భాలు పలుకుతోంది.

కట్టని డబుల్‌ బెడ్రూం ఇండ్లు కనబడటం లేదా? అని ప్లీనరీలో మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండానే 100 శాతం హామీలు నెరవేర్చామని చెప్పుకుంటున్నారు. స్కిజోఫ్రినియా వ్యాధి ముదిరి భ్రాంతిలో బతుకుతున్న టీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్ర ప్రజలను కూడా భ్రాంతిలోకి నెట్టాలని ప్రయత్నిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు