కుటుంబం వేరు.. రాజకీయం వేరు

13 Mar, 2019 12:55 IST|Sakshi

కార్యకర్తల నిర్ణయమే శిరోధార్యం  

కాలవతో కలిసి నడిచే ప్రసక్తే లేదు

ఎంపీ జేసీకి తేల్చిచెప్పిన ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి  

రాయదుర్గం: ‘‘కుటుంబ విషయాలు వేరు...రాజకీయాలు వేరు...మీరు మంత్రి కాలవ విషయంలో మాత్రం జోక్యం చేసుకోవద్దు. అతను నా అనుచరులపై దాడులు చేయించాడు. అక్రమ కేసులు పెట్టించి వేధించాడు. కొంతమంది దొంగలను వెంటేసుకుని అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. ఇలాంటి వారికి ఎలా సహకరించాలి...నాలుగున్నరేళ్లుగా అవమానాలు ఎదుర్కొన్నాం. ఇపుడు కార్యకర్తల నిర్ణయమే నాకు శిరోధ్యారం. వారి అభిలాష ప్రకారం నడుచుకుంటాను’’ అని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎంపీ దివాకర్‌రెడ్డితో స్పష్టం చేసినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. మంత్రి కాలవ తీరుపై మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి నిరసనగళం వినిపించగా...పరిస్థితిని చక్కదిద్దేంకు ఎంపీ దివాకర్‌రెడ్డి రంగంలోకి దిగారు.

మంగళవారం ఉదయం ఆయన మెట్టు గోవిందరెడ్డితో జరిపిన సంప్రదింపులు ఫలించకపోగా...బెడిసి కొట్టాయి. ఆ వెంటనే మెట్టు గోవిందరెడ్డి పార్టీకి రాజీనామా కూడా చేశారు. అనంతరం ఎంపీ జేసీ తన అల్లుడు, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఇంటికి చేరుకుని మంత్రి కాలవపై అసమ్మతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నాలుగున్నరేళ్లుగా జరిగిన సంఘటనలను దీపక్‌రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే సహించేదిలేదని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. బుధవారం కార్యకర్తల సమావేశం ఉందనీ, వారి ఆవేదన వినాలంటే మీరు రండని    ఆహ్వానించగా...ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు