రాజధాని పోరు రసవత్తరం! 

8 May, 2019 05:30 IST|Sakshi

ఢిల్లీ ఓటరు ఎప్పుడూ అంచనాలకు అందడు. విభిన్నమైన తీర్పులతో రాజకీయ పరిశీలకుల్ని అవాక్కు చేస్తూ ఉంటాడు. మరి ఈసారి ఓటరు తీర్పు ఎటు ? రాజధాని ఢిల్లీలోనే కాదు దేశంలోని గల్లీ గల్లీలోనూ ఇప్పుడు ఇదే చర్చ. ఏడు స్థానాలే ఉన్నప్పటికీ అందరి దృష్టి ఇప్పుడు ఢిల్లీపైనే.

కాంగ్రెస్, ఆప్‌ చేతులు కలిపితే ఎలా ఉండేదో కానీ, వారి మధ్య పొత్తు విఫలం కావడంతో రాజధాని ఢిల్లీలో రసవత్తర పోరుకి తెరలేచింది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ పరిణామాలు బీజేపికి కలిసివస్తాయా ? లేదంటే కాంగ్రెస్‌ పునర్‌వైభవం సాధిస్తుందా ? ముఖ్యమంత్రిగా పరిపాలనలో మంచి మార్కులే సంపాదించిన కేజ్రీవాల్‌ క్రేజ్‌ మరోసారి ఊపేస్తుందా?  

దేశానికే రాజధాని. సమస్యలకూ రాజధానే. ఆ సమస్యల్ని ఊడ్చేస్తానంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ చీపురు పట్టుకొని మరీ రాజకీయ రంగ ప్రవేశం చేశాక ఢిల్లీ ఎన్నికల ముఖచిత్రమే మారిపోయింది. కేజ్రీవాల్‌ క్రేజ్‌ దేశాన్ని ఊపేసింది. కానీ ఆయనకున్న జనాకర్షక శక్తి గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవా ముందు వెలవెలబోయింది. 2014 ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసిన రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. ఏడు స్థానాలకు గాను ఏడింట్లోనూ బీజేపీ అ«భ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. వారణాసిలో మోదీనే సవాల్‌ చేసి కేజ్రీవాల్‌ భంగపడ్డారు. పడిలేచిన కెరటంలా మళ్లీ ఏడాదికే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ పుంజుకుంది. కాంగ్రెస్‌ అడ్రస్సే గల్లంతైంది. ఆ తర్వాత రెండేళ్లకి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్‌ మళ్లీ చతికిలపడింది. ఇలా కేజ్రీవాల్‌ పార్టీకి ఆదరణ పెరుగుతూ, తగ్గుతూ ఉండడంతో ఈసారి ఓటరు నాడి పట్టుకోవడం రాజకీయ పరిశీలకులకి సైతం కష్టంగా మారింది.  

2015 నాటికి మారిన సీన్‌ 
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీన్‌ మొత్తం మారిపోయింది. ఎవరి అంచనాలకు అందని విధంగా ఏకంగా 54శాతం ఓటు షేర్‌తో 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో ఆప్‌ విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ 32 శాతం ఓట్లతో మూడు స్థానాల్లో నెగ్గితే, కాంగ్రెస్‌ పార్టీ 9.7 శాతం ఓట్లతో ఒక్క ఎమ్మెల్యేను అసెంబ్లీకి పంపలేక ఘోర పరాజయం పాలైంది.  

2017 స్థానిక సమరం  
ఈ ఎన్నికల్లో ఆప్‌ ఓట్లలో సగానికి సగం తగ్గిపోయాయి. కేవలం 24శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. తన పాలనా విధానాలతో మధ్యతరగతి, దిగువ తరగతి ఓటర్ల మద్దతు సంపాదించిన కేజ్రీవాల్‌ స్థానిక సమరంలో కాషాయం పార్టీతో పోటీ పడలేకపోయారు. మొత్తం 272 మున్సిపల్‌ కార్పొరేషన్‌ సీట్లలో బీజేపీ మూడింట రెండు వంతులు మెజారిటీ సాధించి లోకల్‌ కింగ్‌గా మారింది.  

కాంగ్రెస్, ఆప్‌ పొత్తు విఫలంతో త్రిముఖ పోటీ 
ప్రధాని నరేంద్ర మోదీని ఓడించడానికి ఈసారి చేతులు కలపాలని కాంగ్రెస్, ఆప్‌ తుదివరకు ప్రయత్నించాయి. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆప్‌కి స్నేహ హస్తం అందించడమే కాదు, ఏడు నియోజకవర్గాల్లో నాలుగు సీట్లు ఇవ్వడానికి అంగీకరించారు. కానీ ఢిల్లీతో పాటుగా హరియాణా, చండీగఢ్‌లో పొత్తు ఉంటేనే తాము చేయి కలుపుతామని ఆప్‌ పట్టు పట్టింది. దీనికి కాంగ్రెస్‌ అంగీకరించలేదు. రెండు పార్టీలూ ఎవరికి వారే మొండిపట్టుదలకి పోవడంతో పొత్తు విఫలమైంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మూడు పార్టీలు విడివిడిగానే పోటీ చేశాయి. ఏడు నియోజకవర్గాలకు గాను ఆరు నియోజకవర్గాల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కంటే ఆప్, కాంగ్రెస్‌లకు పడిన ఓట్లు ఎక్కువ. అందుకే ఈ సారి ఈ రెండు పార్టీలు కలిస్తే మోదీ హవాను అడ్డుకోవచ్చునని భావించారు. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్‌లు కలిస్తే మోదీ హవాకు అడ్డుకట్ట పడేదన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. మరి ఈ త్రిముఖ పోటీలో ఎవరిది పై చేయిగా మారుతుందో అంతుపట్టని పరిస్థితులున్నాయి.   

కాంగ్రెస్‌ మళ్లీ పుంజుకోగలదా ?  
గత అయిదేళ్లలో ఢిల్లీలో కాంగ్రెస్‌ ప్రభ మసకబారుతూ వస్తోంది. 2013లో షీలా దీక్షిత్‌ సర్కార్‌ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీ పరిస్థితి అధ్వానంగా మారింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఆ తర్వాత ఏడాది 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతే. ఒక్క ఎమ్మెల్యేని కూడా పంపలేక ఎన్నికల పోరాటంలో చతికిలపడింది. కాంగ్రెస్‌ ఓట్లు 10శాతం కంటే తక్కువకి పడిపోయాయి. అయితే ఆ తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్లు 22 శాతానికి పెరిగాయి. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో 54 శాతం ఓట్లు సాధించిన ఆప్‌ పార్టీ స్థానిక ఎన్నికల సమయానికి 26 శాతానికి పడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌ ముందున్న లక్ష్యం ఒక్కటే.

కనీసం రెండో స్థానానికైనా ఎగబాకాలి. అప్పుడే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయొచ్చునని అంచనాలు వేసుకుంటోంది. అదే జరగాలంటే దళితులు, ముస్లింలు, మురికివాడల ప్రజల్ని మళ్లీ తమ గూటికి తీసుకురాగలగాలి. అది కొంచెం కష్టమైన పనే. ఢిల్లీలో కేజ్రీవాల్‌ సర్కార్‌ విద్యుత్, తాగునీరు, విద్య, ఆరోగ్య రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. మధ్యతరగతి ఓటర్లంతా ఆప్‌వైపే ఇంకా ఉన్నారన్న అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్‌ ధీమా కాంగ్రెస్‌దే. ‘మోదీ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది. ఆప్‌ హామీలన్నీ శుష్కవాగ్దానాలే’ అని వాయవ్య ఢిల్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేశ్‌ తిలోతియా అంటున్నారు.  

కాంగ్రెస్‌ డార్లింగ్‌ షీలా దీక్షిత్‌  
వయసు చూస్తే 81 ఏళ్లు. ఎన్నికల ప్రచారంలో ఆమెలో పొంగిపొరలే ఉత్సాహాన్ని చూస్తుంటే ఇరవై ఏళ్లని అనిపించక మానదు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ ఈశాన్య ఢిల్లీ నుంచి బరిలోకి దిగడంతో కాంగ్రెస్‌ పార్టీకి కొత్త కళ వచ్చింది. హ్యాట్రిక్‌ విజయాలతో పదిహేనేళ్లపాటు ఢిల్లీని పరిపాలించి దేశ రాజధాని స్థాయిని పెంచిన నాయకురాలు. ఫ్లై ఓవర్లు, ఢిల్లీ మెట్రో, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేసే భాగిదాని వ్యవస్థను ప్రవేశపెట్టి మంచి పరిపాలనా దక్షురాలిగా పేరు తెచ్చుకున్నారు.

అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించిన అరవింద్‌ కేజ్రివాల్‌ 2013లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ని పెట్టి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడంతో షీలా అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. కేజ్రివాల్‌తో పోటీ పడలేక ఓడిపోయిన తర్వాత కూడా ఆమె హుందాగానే పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త పార్టీ బలాన్ని తాను అంచనా వేయలేకపోయానంటూ తన వైఫల్యాలను అంగీకరించారు. మొదట్నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు. రాజకీయ నాయకులకు రిటైర్‌మెంట్‌ ఉండదన్న నానుడిని గుర్తు చేస్తూ 81 ఏళ్ల వయసులోనూ ఆమెను ఎన్నికలబరిలో దింపింది కాంగ్రెస్‌ అధిష్టానం. బీజేపీ అభ్యర్థి మనోజ్‌ తివారీ, ఆప్‌ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు దిలీప్‌ పాండేను ఎదుర్కొంటున్నారు. 

ఢిల్లీ నియోజకవర్గాలు : ఏడు 
చాందినీ చౌక్, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ (ఎస్‌సీ), దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ 
బరిలో ఉన్న అభ్యర్థులు : 164 
పోలింగ్‌ తేదీ : మే 12 

2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 
బీజేపీ క్లీన్‌ స్వీప్‌ 7/7 (46%ఓట్లు) 
ఆప్‌ ఒక్కసీటు గెలుచుకోలేకపోయినా 33% ఓట్లతో రెండోస్థానంలో నిలిచింది.  
కాంగ్రెస్‌ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 15శాతం ఓట్లను మాత్రమే సాధించింది. 

>
మరిన్ని వార్తలు