సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై మరోసారి దాడి జరిగింది. ప్రచారంలో భాగంగా దిల్లీలోని మోతీనగర్ రోడ్షోలో పాల్గొన్న కేజ్రీవాల్పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. రోడ్ షోలో మాట్లాడుతున్న కేజ్రీవాల్ వాహనంపైకి ఒక్కసారిగా దూసుకొచ్చి చెంప చెల్లుమనిపించాడు. దీంతో కేజ్రీవాల్తో ఒక్క సారిగా షాక్కు గురయ్యారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
సాధారణంగా ముఖ్యమంత్రికి హై సెక్యూరిటీ ఉంటుంది. కానీ కేజ్రీవాల్ పాల్గొన్న రోడ్ షోలో భద్రతా సిబ్బంది పెద్దగా లేరు. దీంతో సదరు వ్యక్తి వాహనంపైకి దూసుకొచ్చి సీఎం చెంపపై కొట్టాడు. దాడి చేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. కాగా గతంలోనూ కేజ్రీవాల్పై అనేక సందర్భాల్లో దాడులు జరిగాయి. ఒక్కసారి చెప్పులతో దాడి చేయగా, మరోసారి ఇంకు, కారంపొడితో దాడి చేశారు. ఇప్పటి వరకు కేజ్రీవాల్పై ఎనిమిది సార్లు దాడి జరిగింది.