ఢిల్లీ కాలుష్యం : విమర్శలపై సీఎం స్పందన

3 Nov, 2019 18:53 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. పొరుగు రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్లే ఢిల్లీలో ఈ పరిస్థితి తలెత్తిందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకుండా పక్క రాష్ట్రాలపై నిందలు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలో కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా విమర్శలకు సమాధానమిచ్చారు.

‘మేము ఎవరిపైనా ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. మా తాపత్రయమంతా చిన్నారుల ఆరోగ్య భవిష్యత్తుపైనే ఉంది. ఎయిర్‌ క్వాలిటీ  ఇండెక్స్‌ (ఏక్యూఐ) ఈ సంవత్సరంలోనే అత్యధికంగా  625 పాయింట్ల కాలుష్యం నమోదైనట్టు చెప్పింది. పక్క రాష్ట్రాల పంట దహనం కారణంగా ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయిందనేది అక్షర సత్యం. రాజకీయాలు చేసే ఉద్దేశ్యం తమకు లేదు’అని అన్నారు.

జరిమానాలు విధిస్తున్నాం..
నిర్మాణ రంగంలో విపరీతంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న కంపెనీలపై జరిమానాలు విధిస్తున్నామని సీఎం అన్నారు. ఢిల్లీతో పాటు కాలుష్యం బారిన పడిన పంజాబ్‌, హరియాణ సీఎంలు కూడా కేంద్రం‍తో చర్చలు జరిపేందుకు తమతో కలిసిరావాలని కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. ఢిల్లీ ప్రజలంతా తనకు కుటుంబ సభ్యులని సీఎం కేజ్రీవాల్‌ అన్నారు. ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని సూచించారు. కాలుష్యం ముప్పు నుంచి ప్రజలను కాపాడేందుకు సోమవారం నుంచి సరి-బేసి విధానాన్ని పునఃప్రారంబిస్తున్నామని, ప్రజలంతా సహరించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు