న్యూఢిల్లీ : తాజాగా జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మాణిక్ సర్కారు నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం ఓడిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. వామపక్షాలు అంతర్థానం అవుతుండటం దేశానికి తీవ్ర విపత్తు అని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో వామపక్షాలు బలంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.
నిజానికి కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ప్రత్యర్థులు అయినప్పటికీ, వామపక్షాలు లేని లోటును దేశంలో భరించలేదని ఆయన పేర్కొన్నారు. అయితే, సమాజంలో, ప్రజల ఆకాంక్షల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా వామపక్షాలు తమ దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరముందని సూచించారు. త్రిపురలో పాతికేళ్లుగా అధికారంలో ఉన్న వామపక్ష కూటమి సర్కారును కూల్చి.. బీజేపీ కూటమి అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.