సిద్ధరామయ్య వల్లే సంకీర్ణం పతనం 

23 Aug, 2019 11:35 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌– జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సీఎల్పీ అధ్యక్షుడు, మాజీ సీఎం సిద్ధరామయ్యే కారణమని జేడీఎస్‌ అధినేత దేవెగౌడ ఆరోపించారు. సీఎం కుర్చీపై తన కుమారుడు కుమారస్వామి ఉండటం సిద్ధరామయ్యకు ఇష్టం లేదని, ఈక్రమంలో బీజేపీతో లోపాయకారీగా చేతులు కలిపినట్లు ఉందని ఆరోపించారు. దేవెగౌడ గురువారం పార్టీ కార్యాలయంలో నేతల సమావేశంలో మాట్లాడుతూ గత నెలలో తిరుగుబాటు చేసి ముంబై తరలివెళ్లిన ఎమ్మెల్యేలందరూ సిద్ధరామయ్య మద్దతుదారులే అన్నారు. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం పతనమైందని, సిద్ధరామయ్య వైఖరిని కాంగ్రెస్‌ నాయకత్వం గమనించాలని కోరారు.

సీఎల్పీ నేతగా ఉన్న సిద్ధరామయ్యకు ప్రతిపక్ష నేత పదవి ఇవ్వకూడదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రాంతీయ పార్టీలను అణచివేసేందుకు కుట్ర పన్నుతున్నారనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. మైసూరు జిల్లా చాముండేశ్వరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి జేడీఎస్‌ నేత జీటీ దేవెగౌడ చేతిలో ఓడిపోవడంతో సిద్ధరామయ్య గతం మరువలేదన్నారు. అది తట్టుకోలేక కుమారస్వామి ప్రభుత్వాన్ని దించేందుకు బీజేపీతో కలిసి కుట్ర పన్నినట్లు అనుమానం ఉందన్నాన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తుమకూరులో తాను ఓడిపోవడానికి కాంగ్రెస్‌ నేతలే కారణమన్నారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్టు సరికాదన్నారు.  

మరిన్ని వార్తలు