‘బాబుకు రాజధానిలో పర్యటించే హక్కు లేదు’

28 Nov, 2019 20:41 IST|Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబుకి రాజధానిలో పర్యటించే నైతిక హక్కు లేదని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్‌ విమర్శించారు. గత అయిదేళ్లలో రాజధానిపై మీటింగ్‌లో మాట్లాడటం తప్ప బాబు ఎక్కడా.. ఎప్పుడూ తిరగలేదని ప్రస్తావించారు. శంకుస్థాపన చేసిన తరువాత ఎపుడైనా చంద్రబాబు అమరావతి ప్రాంతానికి వెళ్ళారా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌ను భ్రష్టు పట్టించాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు.13 జిల్లాలలో చంద్రబాబు చేపడుతున్న కార్యకర్తల సమావేశాలలో ప్రతి ఒక్క కార్యకర్త చంద్రబాబును నిలదీస్తున్నారన్నారు. రాజధానికి అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతుల బిడ్డలకు ఉచిత విద్య,జాతీయ ఉపాధిహామీ పథకం కింద కూలీలకు పని కల్పిస్తానని ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. 

అలాగే.. ‘గత ప్రభుత్వంలో పనులు పూర్తి చేసిన వారికి బిల్లులు చెల్లించలేదు. అమరావతిలో భాగమైన మంగళగిరిని చంద్రబాబు పట్టించుకోలేదు. గతంలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులు చంద్రబాబును నిలదీస్తున్నారు. బహిరంగ సభలలో మోదీ మట్టి, నీళ్లు తప్ప మనకి ఏమి ఇవ్వలేదు అని చెప్పిన మాటలు వాస్తవం కాదా. టీడీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులతో ఈరోజు రాజధానిలో హడావుడి చేశారు.’  అని టీడీపీపై దేవినేని అవినాష్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు