కరోనా: బాబు ఉండుంటే అలా ఆసత్య ప్రచారం చేసేవారు

13 Apr, 2020 14:51 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాపించినప్పటీ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలు అభినందనీయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్‌ దేవినేని అవినాష్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ కోవిడ్ 19 నియంత్రణ కోసం సమీక్షలు చేసి నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. వాలంటీర్లు, ఆశ వర్కర్లు అందరూ ప్రజా ప్రాణాలు కాపాడటానికి నిరంతర కృషి చేస్తున్నారని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ. 1000 అందిస్తూ కష్టానికి చేయుతను ఇస్తున్న నాయకుడు సీఎం జగన్ అన్నారు. (వారికి ముందుగా పరీక్షలు చేయాలి : సీఎం జగన్‌)

ఇక కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా టీడీపీ నేతలు, నాయకులు సిగ్గుమాలిన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఆ పార్టి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండుంటే టెలి కాన్ఫెరెన్ పెట్టి ఎదో చేసామంటూ ఆసత్య ప్రచారం చేసుకునే వారని విమర్శించారు. తమ నాయకుడు మాటల మనిషి కాదని.. చేతలతో చూపించే మనిషన్నారు. ప్రతిపక్షం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కష్టకాలంలో కూడా రూ. 5 వేలు ఇవ్వాలంటూ దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు, తాము సహించేది లేదని, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ దీక్షలు చేసి భయబ్రాంతులకు గురిచేయవద్దని ఆయన హెచ్చరించారు. (రెడ్‌జోన్‌గా వడమాలపేట)

మరిన్ని వార్తలు