నా మాటల్ని వక్రీకరించారు; దిగ్విజయ్‌ సింగ్‌

16 Jun, 2018 11:59 IST|Sakshi
దిగ్విజయ్‌ సింగ్‌ (ఫైల్‌ఫోటో)

మధ్యప్రదేశ్‌ : ‘మీడియా నా మాటల్ని తప్పుగా అర్ధం చేసుకుంది. నేను మాట్లాడింది ‘సంఘ్‌ టెర్రరిజమ్‌’ గురించి. కానీ మీడియా మాత్రం దాన్ని ‘హిందూ టెర్రరిజమ్‌’ అని ప్రచారం చేసిందం’టూ వివరణ ఇచ్చారు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌. మధ్యప్రదేశ్‌లో నిర్వహిస్తున్న ఏక్తా యాత్ర సందర్భంగా శుక్రవారమిక్కడ నిర్వహించిన మీడియ సమావేశంలో పాల్గొన్నారు దిగ్విజయ్‌ సింగ్‌.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను గతంలో చేసిన ‘సంఘ్‌ టెర్రరిజమ్‌’ గురించి వివరణ ఇచ్చారు. నేను మాట్లాడింది  ‘సంఘ్‌ టెర్రరిజమ్‌’ గురించి..కానీ మీడియా మాత్రం ‘హిందూ టెర్రరిజమ్‌’ అంటూ ప్రచారం చేసిందన్నారు. అంతేకాక తీవ్రవాద కార్యకలపాలను మత ప్రతిపాదికను వేరు చేసి చెప్పలేమని,  ఏ మతం కూడా తీవ్రవాదాన్ని సమర్ధించదన్నారు.

అంతేకాక ‘సంఘ్‌ టెర్రరిజమ్‌’ గురించి తాను గతంలో వెలిబుచ్చిన అభిప్రాయాన్ని బలపరుస్తూ ‘మాలేగావ్‌, మక్కా మసీదు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌, దర్గా షరీఫ్‌ పేలుళ్ల’కు పాల్పడ్డ వారు ‘సంఘ్‌ భావజాలం’ నుంచి స్ఫూర్తి పొందే ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారన్నారు.

‘సంఘ్‌ టెర్రరిజమ్‌’...
గతంలో దిగ్విజయ్‌ ‘ఆర్‌ఎస్‌ఎస్‌’ ప్రచారం చేస్తున్న హింసాకాండ గురించి ‘హింస, ద్వేషం గురించి ప్రచారం చేసే ఈ సంస్థ తీవ్రవాదాన్ని కూడా ప్రచారం చేస్తుంద’ని విమర్శించారు. అంతేకాక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలను ‘సంఘ్‌ టెర్రరిజమ్‌’అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కానీ మీడియ మాత్రం దిగ్విజయ్‌ ‘హిందూ టెర్రరిజమ్‌’ అంటూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని ప్రచారం చేసింది.

బీజేపీ పార్టీ కూడా దిగ్విజయ్‌ చేసిన ‘సంఘ్‌ టెర్రరిజమ్‌’ వ్యాఖ్యలను  హిందూ టెర్రరిజమ్‌ అంటూ ప్రచారం చేసింది. సంఘ్‌ కార్యకర్తలందరూ హిందువులేనని తెలిపింది. ‘సంఘ్‌ టెర్రరిజమ్‌’ అంటే ‘హిందూ టెర్రరిజమే’నంటూ దిగ్విజయ్‌ హిందువులైన సంఘ్‌ కార్యకర్తలను ఉగ్రవాదులతో పోల్చి వారి మనోభావాలను దెబ్బతీసారని మండిపడింది.

>
మరిన్ని వార్తలు