అవకాశమివ్వండి ప్రజల గొంతుకనవుతా

28 Mar, 2019 07:00 IST|Sakshi
మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి, చిత్రంలో టీజేఎస్‌ నేత దిలీప్‌కుమార్‌

మల్కాజిగిరి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి

రేవంత్‌కు టీజేఎస్‌ సంపూర్ణ మద్దతు: దిలీప్‌ కుమార్‌

గౌతంనగర్‌: ప్రజల గొంతుకను పార్లమెంట్‌లో వినిపించడానికి అవకాశం ఇవ్వాలని మల్కాజిగిరి లోక్‌సభ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రేవంతర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మల్కాజిగిరి మధుసూదనగర్‌లోని టీజేఎస్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, టీజేఎస్‌ నేత కపిలవాయి దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డికి టీజేఎస్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. రేవంత్‌రెడ్డి గెలుపుకు అహర్నిశలు కృషి చేస్తామన్నారు. మల్కాజిగిరిలో రేవంత్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని 543 పార్లమెంట్‌ స్థానాల్లో మల్కాజిగిరి అతి పెద్ద నియోజకవర్గంగా ఉందన్నారు.

ఈ ప్రాంతంలో అన్ని మతాలు, కులాలు, రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని వారితో పాటు సమస్యలు కూడా ఉన్నాయన్నారు. ప్రశ్నించే వారు లేకుంటే సమస్యలు పరిష్కారం కావన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని కేసీఆర్‌కు మద్దతునిస్తే ఉద్యమ నాయకుడై ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. అనంతరం గద్దెనెక్కిన కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యా రని విమర్శించారు. 16 సీట్లిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతానని ముఖ్యమంత్రి అనడం విడ్డూరంగా ఉందన్నారు. అంతకన్నా ఎక్కువ సీట్లు వచ్చే పార్టీలు దేశంలో చాలా ఉన్నాయనీ వారెవ్వరూ ఇలాం టి మాటలు మాట్లాడడం లేదన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో మూడు సీట్లను కాంగ్రెస్, మిత్రపక్షం సభ్యులు గెలిపొందాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రు లు, ఉపాధ్యాయులు కేసీఆర్‌కు కర్రు కాల్చి వేత పెట్టారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ  మల్కాజిగిరి అసెంబ్లీ ఇన్‌చార్జి నందికంటి శ్రీధర్, టీజేఎస్‌ నాయకు డు సత్యంగౌడ్, మల్కాజిగిరి సర్కిల్‌ కమిటీ సభ్యు లు రెడ్డిపల్లి శ్రీనివాస్, ప్రవీణ్‌ ఆర్య, పోచయ్య, అశ్విన్, ముతన్న, సుకన్య, గీతాంజలి, దయాకర్, రవికుమార్, జాన్, సాయి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు