సమిష్టిగా విఫలమయ్యాం : దినేశ్‌ కార్తీక్‌

13 Apr, 2019 08:19 IST|Sakshi
దినేశ్‌ కార్తీక్‌

కోల్‌కతా : సొంతగడ్డపై తమ ఓటమికి జట్టుగా తాము చేసిన ప్రయోగం వికటించడం.. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమిష్టిగా విఫలమవ్వడమే కారణమని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఇక మ్యాచ్‌ అనంతరం దినేశ్‌ కార్తీక్‌ ఈ ఓటమిపై మాట్లాడుతూ.. ‘అరంగేట్ర మ్యాచ్‌లోనే జో డెన్లీ గోల్డెన్‌డక్‌ కావడం మా బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది. అలాగే ఈ పిచ్‌పై వికెట్లు తీయడం కూడా కష్టమే. కానీ మా బౌలర్లు కొన్ని విషయాలపై దృష్టిసారించాలి. వాస్తవానికి మేం ఇంకా మా లక్ష్యానికి 10 నుంచి 15 పరుగులు ఎక్కువగానే చేయాల్సింది. మా బ్యాటింగ్‌ కూడా అశించినస్థాయిలో లేకపోవడంతో మంచి లక్ష్యాన్ని నిర్ధేశించలేకపోయాం. మా బౌలర్లు అద్భుతం చేస్తారనుకున్నాను. కానీ అది జరగలేదు. ఇక క్రికెట్‌లో ఇలాంటివి సాధారణమే. ఐపీఎల్‌ ఓటమి నుంచి తేరుకోని పుంజుకోవడం చాలా ముఖ్యం. లిన్‌-నరైన్‌ జోడి తప్పించి మేం చేసిన ప్రయోగం కూడా వికటించింది. వారు జట్టులో లేకపోవడం జట్టుకు ఎప్పటికి మంచిది కాదు. శుబ్‌మన్‌ గిల్‌ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నప్పటికి జో గోల్డెన్‌ డక్‌ తదుపరి బ్యాట్స్‌మెన్‌పై ప్రభావం చూపింది. కానీ అతను మరుసటి మ్యాచ్‌కు పుంజుకోగలడు.’ అని కార్తీక్‌ చెప్పుకొచ్చాడు. 7 మ్యాచ్‌లు ఆడి 4 గెలిచిన కోల్‌కతా 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

అయితే క్రిస్‌లిన్‌-సునీల్‌ నరైన్‌ జోడి జట్టు ఆశించిన స్థాయిలో రాణిస్తలేదని, ఈ మ్యాచ్‌కు మార్పులు చేస్తూ కోల్‌కతా ప్రయోగం చేసింది. శుబ్‌మన్‌-జో డెన్లీలను ఓపెనర్లుగా బరిలోకి దింపింది. కానీ తాము ఒకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు.. ఓపెనర్‌ జోడెన్లీ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇషాంత్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికే క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. మరోవైపు ఐపీఎల్‌లో తొలిసారి ఓపెనర్‌గా వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ విలువైన ఇన్నింగ్స్‌(39 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు