ఈ బడ్జెట్‌ నిరాశ కలిగించింది: కేంద్ర మంత్రి

1 Feb, 2018 16:11 IST|Sakshi
కేంద్ర మంత్రి సుజనా చౌదరీ(ఫైల్‌ ఫోటో)

ఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఎలాంటి ప్రత్యేకత చూపలేదని, ఈ బడ్జెట్ చాలా నిరాశగా ఉందని కేంద్ర మంత్రి సుజానా చౌదరీ విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..రెవిన్యూ లోటు, అమరావతికి నిధులు వంటి అంశాల ప్రస్తావన లేకపోవడం విచారం కలిగించిందని వాపోయారు. పోలవరం ప్రాజెక్ట్‌కి నిధుల సమీకరణ నాబార్డు ద్వారా ఏర్పాటు చేశారు..కానీ నిధుల ప్రవాహమేమీ చెప్పుకోదగిన రీతిలో లేదన్నారు. ఎక్కడెక్కడో మెట్రోలు ఇచ్చారు కానీ విజయవాడ, విశాఖపట్నం నగరాలకు మెట్రో ప్రస్తావన లేదని మండిపడ్డారు. ఓవరాల్‌గా ఈ బడ్జెట్ మీద నిరాశగా ఉన్నామని చెప్పారు.  ఏపీ ప్రజల అభిప్రాయమే తమ వాదమని, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇంకా ఒత్తిడి చేయాల్సి బాధ్యత తమపై ఉందన్నారు.

 బడ్జెట్లో ప్రస్తావించకపోయినా, లైన్ అకౌంట్ నుంచి ఇవ్వొచ్చని, తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తాము నడుచుకుంటామని వివరించారు. మా అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశం తర్వాత కార్యాచరణ నిర్ణయిస్తామని వెల్లడించారు. గత నాలుగు ఏళ్లలో కొంత సాధించామని, ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్నారు. రైల్వే జోన్ తీసుకొచ్చి తీరుతామని, దీన్ని అసలు వదులుకోమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా మాత్రమే దేన్నైనా సాధించుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు