ఆత్మరక్షణ కోసం దళితులకు ఆయుధాలివ్వాలి

5 Apr, 2018 11:23 IST|Sakshi
మాట్లాడుతున్న విరసం నేత కళ్యాణరావు, వేదికపై దుడ్డు ప్రభాకర్, ఇతర నేతలు

విరసం నేత కళ్యాణరావు

ఒంగోలు ఒన్‌టౌన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత, గిరిజనులకు రక్షణ కల్పించలేని దుíస్థితిలో ఉన్నాయని, అందుకే చట్ట ప్రకారం దళిత, గిరిజనుల ఆత్మరక్షణకు ఆయుధాలు ఇస్తే వారిని వారే కాపాడుకుంటారని విప్లవ రచయితల సంఘం నేత జి.కళ్యాణరావు వ్యాఖ్యానించారు. మార్చి 20న సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పు దేశంలో ఎస్సీ,ఎస్టీ ప్రజలు జీవించే హక్కుకు అత్యంత ప్రమాదకరమైందని, అట్రాసిటీ చట్టాన్ని చట్టబద్ధంగా చంపేసిందని, ఈ తీర్పుకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మాంచాల్సిన బాధ్యత, చట్టాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘ జిల్లా అధ్యక్షుడు ఓర్సు శ్రీనివాసరావు అధ్యక్షతన స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం సాయంత్రం సదస్సు నిర్వహించారు.

ప్రధాన వక్తగా కళ్యాణరావు హాజరై మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో 11 మంది దళితులు హిందూ మతోన్మాద కాషాయమూకల తూటాలకు బలయ్యారని, వారి పోరాట స్ఫూర్తితో చట్టం మరింత పటిష్టతకు ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని కళ్యాణరావు పేర్కొన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌ మాట్లాడుతూ దేశంలో అమానుష నిచ్చనమెట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించిన పూలే, అంబేడ్కర్, పెరియార్‌ రామస్వామి వంటి మహనీయుల పోరాటం ఫలితంగా వచ్చిన అనేక చట్టాలను పాలకులు తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. దళిత వ్యతిరేక మతోన్మాద శక్తులు రాజ్యంలోకి వచ్చి రిజర్వేషన్లు ఎత్తేయాలని, రాజ్యాంగాన్ని సవరించాలని, దాని స్థానంలో మనుస్మృతిని అమలు చేయాలని కుట్రలు పన్నుతున్నాయని, సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా పీడిత కులాలు ఐక్యంగా ఉద్యమించాలని ప్రభాకర్‌ పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు దుడ్డు విజయ్‌సుందర్, డాక్టర్‌ నూకతోటి రవికుమార్, నక్కల వీరాంజనేయులు, పాలడుగు విజయేంద్ర బహుజన్‌ మాట్లాడారు. సదస్సును దుడ్డు వెంకట్రావు పర్యవేక్షంచారు.

>
మరిన్ని వార్తలు