గద్వాల నుంచే కేసీఆర్‌ పతనం: డీకే అరుణ

30 Jun, 2018 10:24 IST|Sakshi
డీకే అరుణ (ఫైల్‌ ఫోటో)

సాక్షి​, హైదరాబాద్‌ : గద్వాల నుంచే సీఎం కేసీఆర్‌ పతనం ప్రారంభమవుతుందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ ఫైర్‌ అయ్యారు. గద్వాల సభలో కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారని, మామాఅల్లుళ్లు తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నారని అరుణ విమర్శించారు. పాలమూరు ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని గుర్తుచేశారు. ఎన్నికలు వస్తున్నాయని మొక్కుల పేరిట కేసీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పరిస్థితులు అనుకూలించి ఉంటే మంత్రి హరీష్‌రావు ఎప్పుడో కాంగ్రెస్‌ కండువా కప్పుకునేవారని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. గట్టు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుక్రవారం గద్వాలలో పర్యటించిన విషయం తెలిసిందే.

‘తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది.  జనాలను మోసం చేసే వాళ్లు ఎవరో విజయవాడ కనకదుర్గమ్మకు బాగా తెలుసు. అమ్మవార్ల అందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న మోసాలు తెలుసు. జై తెలంగాణ అన్న వారిపై దాడి చేసిన వారికి మంత్రి పదవులిచ్చి తనకు రెండు వైపులా కూర్చోబెట్టుకుంది నీవు కాదా కేసీఆర్‌. తెలంగాణ వచ్చింది ప్రజలు కోసం కాదు. కేసీఆర్ కుటుంబం కోసం. మంత్రి హరీష్ రావు జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకో. పరిస్థితులు అనుకూలిస్తే కాంగ్రెస్ లోకి వచ్చేవాడివి. అలాంటి నువ్వా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది’ అంటూ డీకే అరుణ మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు