కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఫైర్..
జూన్లో పాదయాత్ర చేస్తానని ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి పేరుతో కొత్త పార్టీ పెట్టిన కోదండరాంను కేసీఆర్ పెరట్లో మొక్కగా అభివర్ణించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ. టీఆర్ఎస్ను ఓడించడమే కోదండరాం లక్ష్యమైతే కాంగ్రెస్తో కలిసి నడవాలని, అలా వచ్చినప్పుడే వారి లక్ష్యాలు నిజమైనవనే విశ్వాసం కలుగుతుందని అన్నారు. దళితులపై దాడులు పెరిగిపోవడాన్ని నిరసిస్తూ టీపీసీసీ సోమవారం గాంధీభవన్లో చేపట్టిన నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్చాట్ చేశారు.
ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ పాదయాత్ర: కేసీఆర్ నేతృత్వంలో ప్రజాకంటక పాలన సాగుతున్నదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు జనం తప్పక బుద్ధి చెబుతారని డీకే అరుణ అన్నారు. 2019 ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసే దిశగా పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర ఉంటుందని, జూన్లో యాత్రను ప్రాంరభిస్తానని పేర్కొన్నారు. ఇటీవలికాలంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోన్న అంతర్గత ప్రక్షాళననకు సంబంధించిన వ్యవహారాలపై స్పందిస్తూ.. 70 ఏళ్లకు పైబడినవారిని తప్పిస్తారా, లేదా అన్నది హైకమాండ్ నిర్ణయింస్తుందని, వ్యాఖ్యానించారు.