సాక్షి, హైదరాబాద్ : రాహుల్ గాంధీ చేస్తోన్న వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ మండిపడ్డారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా ఉన్నాయన్నారు. రాహుల్ ఏనాడు ప్రజలకు దగ్గరలో లేరని విమర్శించారు. బీజేపీపై ఆయన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అతి విశ్వాసమే ఆ పార్టీ కొంపముంచిందన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీతో కలసి రావాలని అరుణ పిలుపునిచ్చారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు. ఫారెస్ట్ అధికారిణిపై దాడి చేసిన సంఘటనపై సీఎం కేసీఆర్ ఇంత వరకూ స్పందించకపోవడం దారుణమన్నారు. అధికార పార్టీ కనుసన్నల్లోనే మున్సిపల్ వార్డుల విభజన జరుగుతుందని ఆమె ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు విలువైన ప్రభుత్వ భూములు ఇవ్వటం పట్ల అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూములపై అధికారులు పునః పరిశీలన చేయాలని ఆమె డిమాండ్ చేశారు.