‘ముస్లింలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేసింది​‍’

18 Jan, 2020 17:52 IST|Sakshi

సాక్షి, జోగులాంబ గద్వాల: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నిస్తారని కేసీఆర్‌, కేటీఆర్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని ఆమె విమర్శించారు. మైనారిటీలకు కేటాయిస్తున్న నిధులను ప్రభుత్వం ఖర్చు చేయలేదని డీకే అరుణ ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే కేసీఆర్ కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ ఇద్దరికీ సవాలే..!  

రాజకీయ లబ్ది కోసం బీజేపీపై టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసే దిశలో లేదన్నారు. టీఆర్ఎస్‌కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు అందకుండా నిలిపివేస్తామని..  ప్రజలను టీఆర్ఎస్ నాయకులు బెదిరిస్తున్నారని ఆమె ఫైర్‌ అయ్యారు. పింఛన్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవని డీకే అరుణ దుయ్యబట్టారు. మున్సిపాలిటీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని డీకే అరుణ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు