బెంగళూర్ : కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్కు ఎలాంటి ముప్పు లేదని కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి డీకే శివకుమార్ అన్నారు. ప్రభుత్వ మనుగడ కోసం తమ పార్టీ ఎమ్మెల్యేలు పులుల్లా పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు. రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గత కొద్దిరోజులుగా తిరిగి సంకీర్ణ గూటికి చేర్చేలా డీకే ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
అసమ్మతి ఎమ్మెల్యేలందరూ పార్టీ టికెట్పై గెలుపొందారని, వారికి దీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. రెబెల్ ఎమ్మెల్యేల డిమాండ్లను పార్టీ నాయకత్వం ఆమోదిస్తుందని స్పష్టం చేశారు. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా రెబెల్ ఎమ్మెల్యేలు ఓటు వేస్తే వారి శాసనసభ్యత్వాలు రద్దవుతాయని డీకే నర్మగర్భంగా హెచ్చరించారు.
రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీకి విధేయత ప్రకటిస్తామని సంకేతాలు పంపుతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా రాజీనామా చేసిన 15 మంది సంకీర్ణ ఎమ్మెల్యేలు తమకు మద్దతు పలుకుతున్నారని బీజేపీ నేత యడ్యూరప్ప పేర్కొన్నారు. రాజీనామాపై వెనక్కితగ్గేది లేదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డిని ఆ పార్టీ అగ్రనేతలు బుజ్జగిస్తున్నారు.