వైఎస్సార్‌సీపీలోకి డొక్కా, రెహమాన్‌

10 Mar, 2020 05:32 IST|Sakshi
డొక్కా మాణిక్యవరప్రసాద్, రెహమాన్‌

ప్రభుత్వ విధానాలు నచ్చడం వల్లే చేరామని వెల్లడి

సీఎం జగన్‌ నిర్ణయాలపై డొక్కా, రెహమాన్‌ ప్రశంసలు

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, విశాఖ మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహమాన్‌లు వైఎస్సార్‌సీపీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వారు వేర్వేరుగా వచ్చి పార్టీలో చేరారు. వారికి సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. డొక్కా చేరిక కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. 

జగన్‌ నాయకత్వం ఆకర్షించింది
2014, 2015లోనే వైఎస్సార్‌సీపీలో చేరాల్సి ఉన్నా, రాయపాటితో కలిసి అప్పట్లో టీడీపీలో చేరాను. అక్కడ నాకు కలిసి రాలేదు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగస్వామిని కావాలని వైఎస్సార్‌సీపీలో చేరాను. జగన్‌ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నన్ను ఆకర్షించాయి. – డొక్కా మాణిక్య వరప్రసాద్‌

ఆ రోజే సీఎంకు మద్దతు తెలిపాను 
విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రకటించిన రోజే సీఎం నిర్ణయానికి మద్దతు తెలిపాను. నా సతీమణి మద్యపాన నిషేధం కోసం పోరాటం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న మద్యం విధానం బావుంది. పదవుల కోసం పార్టీలో చేరలేదు. విశాఖపట్నం మేయర్‌ పీఠాన్ని కచ్చితంగా వైఎస్సార్‌సీపీ గెలుచుకుంటుంది.  – ఎస్‌ఏ రెహమాన్‌  

మరిన్ని వార్తలు