‘ఆ విషయంలో కొండబాబు బాబునే మించిపోయాడు’

24 Oct, 2018 12:53 IST|Sakshi

కాకినాడ చరిత్రలో ఇంతటి అవినీతి చూడలేదు : ద్వారంపూడి

సాక్షి, కాకినాడ:  కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కో-ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిప్పులు చెరిగారు. అబద్ధాలు చెప్పడంలో కొండబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మించిపోయాడని అన్నారు. ఈ మధ్య కొండబాబు అబద్ధాలతోపాటు నటన కూడా నేర్చారని ఎద్దేవా చేశారు. అన్నపూర్ణ ట్రాన్స్‌పోర్ట్ పెట్టి ఎంతో చరిత్ర కలిగిన కాకినాడ లారీ యూనియన్‌ను కొండబాబు తొక్కిపెట్టారనీ, కాకినాడ చరిత్రలో ఇంతటి అవినీతి పరున్ని చూడలేదని అన్నారు. బుధవారం ద్వారంపూడి మీడియాతో మాట్లాడారు.

పట్టుబడింది ఆయన అనుచరుడే
ఆయిల్ మాఫీయాలో పోలీసులకు పట్టుబడింది టీడీపీ నేత కొండబాబు ప్రధాన అనుచరుడేనని ద్వారంపూడి ఆరోపించారు. 100 కోట్ల రూపాయల ఆయిల్ స్కామ్ జరిగితే అందులో రూ.50 కోట్లు కొండబాబు దండుకున్నాడని అన్నారు. ప్రభుత్వాధికారుల బదిలీల్లో కూడా కొండబాబు అవినీతికి పాల్పడుతున్నాడని అన్నారు. పోలీసు, మున్సిపల్ అధికారుల బదిలీలలో కొండబాబు ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. పేకాట క్లబ్బులు, సింగిల్ నెంబర్ లాటరీ, గుట్కా వ్యాపారుల నుంచి కొండబాబు బంధువులకు మామూళ్ళు అందుతున్నాయని అన్నారు.

మరిన్ని వార్తలు