టీడీపీ ఎమ్మెల్సీ కావరం.. బూతులు తిడుతూ!

26 Jul, 2018 13:03 IST|Sakshi

సాక్షి, పార్వతీపురం : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మంత్రులు, అధికార టీడీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సమస్యలపై నిలదీస్తే మహిళా ఉద్యోగులనే కాదు, పార్టీకి చెందిన మహిళా నేతలను సైతం వదిలిపెట్టని ఘటనలు ఏపీలో నిత్యం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో తమ సమస్య తీర్చాలని కోరినందుకు ఓ టీడీపీ నేత బూతు పురాణం మొదలెట్టడంతో స్థానికులు కంగుతిన్నారు. జిల్లాలోని పార్వతీపురం మున్సిపాలిటీలో సమస్యలపై ప్రశ్నించగా ఉద్రిక్త వాతావారణం నెలకొంది. మమ్మల్నే నిలదీస్తారా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్‌ దాడికి దిగి దాష్టీకానికి పాల్పడ్డారు.

వాస్తవానికి విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో రెండు రోజులుగా మంచినీటి కుళాయిల్లో బురదనీరు సరఫరా అవుతోంది. ఇన్ని ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటుంటే, తాగునీరు ఇవ్వకుండా గ్రామదర్శిని కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని స్థానికుల తరఫున వైఎస్సార్‌సీపీ నేతలు ఎమ్మెల్సీ జగదీశ్‌ను ప్రశ్నించారు. అధికార పార్టీ నేతనైన నన్నే ప్రశ్నిస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ నేత జగదీష్ ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అదేంటని ప్రశ్నించిన కారణంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై సైతం బూతులు మాట్లాడుతూ దూసుకొచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ దాడికి దిగడంతో ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది. కాగా, ఈ తతంగం అంతా స్ధానిక ఎమ్మెల్యే చిరంజీవి సమక్షంలోనే చోటు చేసుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు