ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎదుట డ్వాక్రా మహిళల ఆవేదన
టక్కరి మాటలు చెప్పాడు.. చిక్కుల్లో పడేశాడు
ఒక్క పైసా కూడా రుణం మాఫీ కాలేదు
కోర్టు మెట్లెక్కించాడు.. అప్పుకట్టినా వడ్డీ కట్టాలంటున్నారని ఆవేదన
నాలుగేళ్లుగా అన్నీ కష్టాలేనంటూ వాపోయిన నిరుద్యోగులు
ఇంటికో ఉద్యోగం లేదా ఉపాధి అన్నారు.. ఏదీ లేదు
హామీ ఇచ్చిన మేరకు నిరుద్యోగ భృతీ ఇచ్చింది లేదని మండిపాటు
అందరి సమస్యలు విని ధైర్యం చెప్పిన జననేత
వైఎస్సార్సీపీలో చేరిన రిటైర్డ్ ఎస్పీ యజ్జల ప్రేమ్బాబు
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘చంద్రబాబు పచ్చి దగాకోరు.. నయవంచకుడు.. మమ్మల్ని నట్టేటముంచేశాడు.. మహిళలని కూడా చూడకుండా దారుణంగా మోసం చేసింది కాక, నోటీసులిప్పించి కోర్టు చుట్టూ తిప్పుతున్నాడు. కంటిమీద కునుకు లేకుండా ఏడిపిస్తున్నాడు. ఉన్న బంగారం కూడా పోయేలా చేశాడు’ అంటూ ఎస్ రాయవరం మండలం వెంకటాయపాలెంకు చెందిన డ్వాక్రా మహిళలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దారుణంగా మోసం చేసిన ఈ పెద్దమనిషికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని శపథం చేశారు. ఎంతకైనా తెగించి పోరాడతామని ప్రతిన బూనారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 242వ రోజు మంగళవారం జగన్ విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా దార్లపూడి వద్ద డ్వాక్రా మహిళలు.. చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాన్ని ఏకరువు పెట్టారు.
హామీ నెరవేర్చకుండా కోర్టుకెక్కించారు..
చంద్రబాబు మోసాన్ని జగన్ వద్ద చెప్పిన.. డ్వాక్రా మహిళలు నాగరత్నం, రమణమ్మ, సత్యవతి, నాగమ్మ, మంగ, అప్పలనర్స, దేవి కళ్లు చింతనిప్పుల్లా ఉన్నాయి. మాటలు తూటాల్లా పేలాయి. ‘మా ఊళ్లో మొత్తం నాలుగు డ్వాక్రా గ్రూపులు. 12 మంది ఉండే ఒక్కో గ్రూపునకు 2008లో రూ.3 లక్షల చొప్పున ఎస్ రాయవరం బ్యాంకు అప్పు ఇచ్చింది. 2014 వరకు క్రమం తప్పకుండా అప్పు కట్టాము. అప్పట్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు మాటలు నమ్మి అప్పు కట్టడం ఆపేశాం. ఆయన సీఎం అయ్యారు కానీ మా రుణాలు మాత్రం మాఫీ కాలేదు. పైగా అప్పు కట్టలేదంటూ మాకు నోటీసులొచ్చాయి. బ్యాంకుల్లో బంగారం వేలం వేశారు. మేము తీసుకున్న రూ.3 లక్షల అప్పునకు గాను అంతే మొత్తం మేర (రూ.3 లక్షలు) అడపా దడపా చెల్లించాం. కానీ ఇప్పుడు ఒక్కో గ్రూపు వాళ్లు రూ.8 లక్షలు కట్టాలని బ్యాంకు వాళ్లు నోటీసులిచ్చారు. చంద్రబాబు చేసిన మోసానికి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలయ్యా.. ఆత్మహత్యే శరణ్యం..’ అని కన్నీటిపర్యంతమయ్యారు. జగన్ అధికారంలోకొస్తేనే తమ కష్టాలు తీరతాయన్నారు. చంద్రబాబు చేసిన మోసాన్ని డప్పు వేసి అందరికీ చెబుతామన్నారు.
నిరుద్యోగులకూ కుచ్చుటోపీ
‘ఉద్యోగం ఇస్తానన్నాడు. ఇవ్వకపోతే రూ.2 వేల భృతి కల్పిస్తానన్నాడు. ఆరు నెలల్లో ఎన్నికలున్నాయని ఇప్పుడు రూ.వెయ్యి ఇస్తానంటున్నాడు. అదీ కొంత మందికేనట. అది కూడా ఇంకా ఇవ్వడం లేదు. ఈ చంద్రబాబును ఇంకెందుకు నమ్ముతాం’ అంటూ చౌడవాడ క్రాస్ దగ్గర అప్పలరాజు మల్లీశ్వర్, దయానంద్.. పలువురు యువకులు అన్నారు. జగన్తో కలిసి వారు అడుగులో అడుగులేస్తూ కష్టాలు చెప్పుకున్నారు. బీటెక్, ఎంటెక్ చదువుకున్నా నిరుద్యోగులుగానే మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సహకార చక్కెర ఫ్యాక్టరీలు నష్టపోతున్న తీరు, ఇసుక తరలింపు గురించి పలువురు జననేతకు వివరించారు. పాత రోడ్డు జంక్షన్ వద్ద జగన్ను కలిసిన రెండు కాళ్లు లేని దివ్యాంగుడు.. చంద్రబాబుకు దయలేదా? అని ప్రశ్నించాడు. ఇంటికో ఉద్యోగమన్నాడు. డిగ్రీ చదివిన నాకు ఏదయ్యా.. ఉద్యోగం అని ప్రశ్నిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చంద్రబాబు, లోకేశ్లకు ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా తమ ఊరికి రోడ్డు వేయలేదని కోటవురట్ల మండలం అల్లుమియ్యపాలెం గ్రామస్తులు జననేతకు వివరించారు. భూములు కోల్పోయినా ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని పోలవరం కాల్వ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ను ముస్లింలు ప్రత్యేకంగా కలిశారు. బక్రీద్ జరుపుకుంటున్న సమయంలో తమ ప్రాంతంలో జననేత పర్యటించడం ఆనందంగా ఉందన్నారు. తమకు ఎంతో మేలు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. అదే బాటలో జగన్ తమకు తోడుగా ఉంటాడని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు తమను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాడని ధ్వజమెత్తారు.
కొండ కోనల్లో బరువెక్కిన గుండెలు
కోటవురట్ల శివారు నుంచి మొదలైన పాదయాత్ర చౌడవాడ క్రాస్, గొట్టివాడ, పందూరు క్రాస్, రామచంద్రాపురం క్రాస్, దార్లపూడి గ్రామాల వరకు కొండల మధ్యే సాగింది. గొట్టివాడ సమీపంలో పరదేశమ్మ జాతరకు పరిసర ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. ఆ ప్రాంతంలో పాదయాత్ర సాగుతున్నప్పుడు జాతరకొచ్చిన వాళ్లంతా జగన్ను కలిసేందుకు పోటీ పడ్డారు. దారిపొడవునా పెన్షన్ల రాని వృద్ధులు, టీడీపీ నేతల దౌర్జన్యాలకు నష్టపోయిన ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు జననేతను కలిసి కన్నీళ్లు పెట్టుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు. బాధతప్త హృదయాలను ఓదారుస్తూ, మంచి రోజులొస్తాయని భరోసా కల్పిస్తూ జగన్ ముందుకు సాగారు. కాగా, విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన విజిలెన్స్ రిటైర్డ్ ఎస్పీ యజ్జల ప్రేమ్బాబు మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనతో పాటు మరో 200 మంది పార్టీలో చేరినట్లు ప్రకటించారు.
బాబు రుణ మాఫీ వడ్డీకి కూడా సరిపోలేదు
వైఎస్ హయాంలో నా కుటుంబానికి రూ.1.60 లక్షల పంట రుణం మాఫీ అయింది. దీంతో మాకు ఎంతో ఉపశమనం కలిగింది. ఇందిరమ్మ పథకం కింద పక్కా ఇల్లు నిర్మించుకున్నాం. నాలుగేళ్ల క్రితం రూ.2 లక్షలు పంట రుణం తీసుకున్నాం. ఈ ప్రభుత్వ హయాంలో రూ.24 వేలు మాత్రమే మాఫీ అయింది. అది వడ్డీకి కూడా సరిపోలేదు. విషయాన్ని జగన్ గారికి వివరించాను.
– సూరాకాసుల గోవిందు, మూలపర గ్రామం
జగన్ వస్తేనే చక్కెర ఫ్యాక్టరీలకు మహర్దశ
మహానేత వైఎస్.. సహకార చక్కెర కర్మాగారాలకు అండగా నిలిచారు. మూతపడిన ఫ్యాక్టరీలను సైతం తెరిపించి లాభాల బాటపట్టించేలా ఆర్థికంగా ఊతమిచ్చారు. వైఎస్సార్ రాక ముందు చెరకు టన్ను రూ.850 నుంచి రూ.1150 వరకు ఉండేది. వైఎస్సార్ వచ్చాక ఒక్కసారిగా రూ.1300 నుంచి రూ.1500కు పెంచారు. ఆ సమయంలో నేను పనిచేసిన ఏటికొప్పాక చక్కెర ఫ్యాక్టరీకి జీవో 43, 46ల ద్వారా ఒకేసారి రూ.96 లక్షల ఆర్థిక సహాయం లభించడంతో లాభాల బాట పట్టింది. ప్రస్తుతం చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైపోయింది. మళ్లీ ఈ రంగం పునరుజ్జీవం పొందాలంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావాల్సిందే.
– రిటైర్డ్ అకౌంటెంట్ కేవీ కృష్ణారావు
ఇదం జగత్ టీజర్ విడుదల చేసిన జగన్
సుమంత్, అంజు కురియన్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘ఇదం జగత్’ సినిమా టీజర్ను ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్.. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండలం దార్లపూడిలో సాయంత్రం బస చేసిన శిబిరంలో హీరో సుమంత్ సమక్షంలో టీజర్ను విడుదల చేశారు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ శ్రీకంఠం దర్శకుడు.
– సాక్షి, విశాఖపట్నం