‘గులాబీ’ బూత్‌లకు మంగళం!

18 Nov, 2018 01:55 IST|Sakshi

మహిళల ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలపై ఈసీ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా కేవలం మహిళా ఓటర్లకోసం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలకు నిర్దిష్టంగా ఒక రంగు అంటూ ఏమీ ఉండకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏదైనా ఒక రంగు వాడిన పక్షంలో అది ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధించిందని భ్రమ కలిగించే అవకాశమున్నందున అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనీ, అలాంటి అనుమానాలకు తావులేకుండా చూడాలని రాష్ట్రానికి పం పిన లేఖలో తెలిపింది. గులాబీ రంగులో మహిళలకోసం ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘సాధారణంగా స్త్రీలకు సం బంధించిన ఏవైనా కార్యక్రమాలను నిర్దిష్టంగా చేపడుతున్నప్పుడు గులాబీ (పింక్‌) రంగును సంకేతంగా వాడుతుంటాం. కేన్సర్‌ పట్ల అవగాహనకు నిర్వహించే ‘పింక్‌ రన్‌’ అలాంటిదే. అదే పంథాలో మహిళల కోసం ఉద్దేశించిన పోలింగ్‌ కేంద్రాలను పింక్‌ పోలింగ్‌ బూత్‌లని అంటారు. రాష్ట్రంలోని ఒక రాజకీయపార్టీ పతాకం గులాబీ రంగులో ఉన్నందువల్ల, దీని మీద అపోహలు ఏర్పడుతున్నాయి.

అందుకే అనుమానాలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. దీనికి సమాధానంగా అటువంటి పోలింగ్‌ బూత్‌ ల నిర్మాణంలో ఏ ఒక్క రంగును వాడొద్దని ఆదేశించింది’’ అని ఆయన తెలి పారు. ఈ బూత్‌లలో విధులు నిర్వర్తించే వారు ధరిం చే దుస్తుల మీద ఆంక్షలేమీ ఉండవని స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో ప్రతి శాసనసభా నియోజకవర్గంలో కేవలం స్త్రీలకోసం పోలిం గ్‌ బూత్‌ను ఏర్పాటుచేయడం జరుగుతున్నది. వీటిని ‘పింక్‌ బూత్‌’లనీ, ‘సఖి బూత్‌’లని అంటారు.

మరిన్ని వార్తలు