ఈవీఎంలపై ఫిర్యాదులకు ఈసీ హెల్ప్‌లైన్‌

22 May, 2019 01:34 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలపై వచ్చే ఫిర్యాదులపై స్పందించేందుకు 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్‌రూమ్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో ఉపయోగించిన అసలైన ఈవీఎంల స్థానంలో కొత్త వాటిని స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో పెట్టి, వాటిలోని ఓట్లనే లెక్కించనున్నారన్న ఆరోపణలు రావడం, అవన్నీ అవాస్తవాలేనని ఈసీ మంగళవారం కొట్టిపారేయడం తెలిసిందే.

అయితే స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో ఈవీఎంలను భద్రపరిచిన తీరు, స్ట్రాంగ్‌ రూమ్‌లకు కల్పించిన భద్రత, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద తమ ఏజెంట్లను నియమించేందుకు అభ్యర్థులకు అనుమతి, ఆ పరిసరాలపై సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెట్టడం, ఈవీఎంల తరలింపు సహా ఈవీఎంలకు సంబంధించిన ఏ సమస్యలపైనైనా ఫిర్యాదులు చేయవచ్చని ఈసీ వెల్లడించింది. ఈ ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఐదు లైన్లతో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామనీ, ఫిర్యాదుదారులు 011–23052123 నంబర్‌కు ఫోన్‌ చేసి తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని ఈసీ తెలిపింది.

మరిన్ని వార్తలు