హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

23 Sep, 2019 12:25 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. నేటి(సెప్టెంబర్‌ 23) నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 1న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్‌ 3 వరకు ఉపసంహరణ జరగనుంది. అక్టోబర్‌ 21న పోలింగ్‌ నిర్వహించి.. 24వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ మేరకు అధికారులు హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. 

హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చెయ్యడం తో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. హుజూర్ నగర్ కు పీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ కావటంతో కాంగ్రెస్ ,టీఆర్‌ఎస్  ఇరు పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. నల్గొండ ఎంపీ స్థానం పోగొట్టుకున్న టీఆర్‌ఎస్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్‌ కూడా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు బరిలోకి ఉత్తమ్ సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతిని దింపనుంది. ఇక రాష్ట్రంలో పట్టుసాదించడం కోసం తహ తహలాడుతున్న బీజేపీ గట్టి అభ్యర్థిని వెతికే పనిలో పడింది.

మరిన్ని వార్తలు