4డీ పబ్లిసిటీతో ప్రచారంలో కొత్త పుంతలు

14 Mar, 2019 08:31 IST|Sakshi

ఈ టెక్నికల్‌ యుగంలో ఎన్నికల క్యాంపెయిన్‌ అంటే ఆషామాషీ కాదు. ఎన్నికల పోరులో నిలబడిన నాయకులు ప్రజలకు తమ పార్టీ విధి విధానాల గురించి తెలపాలంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాల్సిందే. కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లు.. పాతకాలం ముచ్చట. నేడు ప్రచారమంతా కొత్తగా, లేటెస్ట్‌ టెక్నాలజీతో సాగుతోంది. అందుకు తగిన సాధనాలు సిద్ధమైపోయాయి. నేటి కొత్త తరహా క్యాంపెయిన్ల కోసం రూపొందిన అడ్వాన్స్‌ సాధనం 4డీ ఎల్‌ఈడీ వీడియో వ్యాన్‌. 

ఆడియో విజువల్‌ సిస్టమ్‌..
వింటే మరిచిపోతాం. చదివింది గుర్తుకురాకపోవచ్చు. అదే మనిషిని నేరుగా కలిస్తే, వాళ్లు మాట్లాడింది నేరుగా వింటే ప్రభావవంతంగా ఉంటుంది. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు ప్రతిచోటకూ వెళ్లలేరు. అందుకే తామున్న చోట నుంచి, తమ సందేశాన్ని పబ్లిక్‌ ఉన్న ప్రదేశాల్లోకి చేరవేయడానికీ, లైవ్‌గా ప్రచారం సాగించడానికి అనుగుణంగా రూపొందిన వాహనమే 4డీ ఎల్‌ఈడీ వీడియో వ్యాన్‌.

ఇవి దేశంలోనే తొలిసారిగా ఈ ఎన్నికల్లో తెలంగాణలో వినియోగంలోకి వచ్చాయి. నాలుగు వైపుల నుంచి అంతా వీక్షించడానికి అనువుగా స్క్రీన్లు, సౌండ్‌ సిస్టమ్, జనరేటర్‌ అమర్చిన ఈ వాహనం ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందని అంటున్నారు దీని రూపకర్త, కీర్తి తరంగ క్రియేషన్స్‌ ప్రొప్రయిటర్‌ మునుగంటి శ్రీనివాస్‌.  

సదుపాయాలన్నీ.. ఆల్‌ ఇన్‌ వన్‌
ఈ 4డీ వాహనం ఖరీదు రూ. 25 లక్షలు. పగటి పూట కూడా ఈ వాహనాలపై ఉండే ఎల్‌ఈడీల్లో ప్రసారమయ్యే దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. నిరంతరాయంగా విజువల్స్, ఆడియో రన్‌ చెయ్యడానికి 15 కేవీఏ జనరేటర్, వైర్‌లెస్‌ మైకులతో కూడిన 440 వాట్స్‌ సరౌండ్‌ సౌండ్‌ సిస్టమ్, ముఖాముఖి మాట్లాడ్డానికి వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం, టీవి ప్రత్యక్షప్రసారం చేసే వెసులుబాట్లు ఉన్నాయి. ర్యాలీలకు ఉపయోగకరంగా వైర్‌లెస్‌ వీడియో కెమెరాలు, జీవీఎస్‌ సిస్టమ్‌ ఇవన్నీ ఈ వ్యాన్‌ ప్రత్యేకతలు.

ఎన్నో ఏళ్ల అనుభవం, రీసెర్చ్‌ ఫలితం..

‘‘ఫొటోగ్రఫీ, వీడియో ప్రొడక్షన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అనుభవంతో ఎన్నికల సమయంలో అవసరాలను గుర్తించి, అందుకు తగిన సాధనాలను, ప్రొజెక్టర్లు, ఎల్‌ఈడీ వాల్స్‌ అందిస్తూ ఉన్నాం. గత ఎన్నికల్లో సింగిల్‌ స్క్రీన్‌తో ప్రచారం నిర్వహించడానికి వాహనం సిద్ధం చేశాం. 2014లో ఎంపీ బీబీ పాటిల్‌ కోసం ఈ తరహా వాహనాలను తొలిసారిగా వినియోగించాం. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల సమయానికి తాజా 4డీ ఎల్‌ఈడీ వీడియో వ్యాన్‌ని రూపొందించాం. వీటిని మొన్న డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మధిర, నిజామాబాద్, బోధన్, జుక్కల్‌ ఎంఎల్‌ఏలు ప్రచార సాధనా లుగా వినియోగించారు. వీరంతా ఆ ఎన్నికల్లో విజయం సాధించారు’’.   
 – మునుగంటి శ్రీనివాస్‌ 

మరిన్ని వార్తలు