2,300 బస్సులు కావాలి

2 Dec, 2018 05:49 IST|Sakshi

ఆర్టీసీని అడిగిన ఎన్నికల సంఘం

సాక్షి, హైదరాబాద్‌: నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి మరో తీపి వార్త ఇది. పోలింగ్‌ సమీపిస్తున్న సమయంలో ఎన్నికల సంఘం నుంచి మంచి ప్రతి పాదన వచ్చింది. ఎన్నికల నిర్వహణకోసం తమకు 2,300 బస్సులు కావాలని ఆర్డర్‌ ఇచ్చింది. సెప్టెంబర్‌లో కొంగరకలాన్‌ సభ, అక్టోబర్‌లో దసరా సీజన్‌ రావడంతో ఆర్టీసీకి కాస్త కలెక్షన్లు పెరిగాయి.

క్రితంసారి కంటే ఎక్కువే..!
2014 ఎన్నికల్లో ఎన్నికల సంఘం దాదాపు 2,800 ఆర్టీసీ బస్సులు వినియోగించింది. ఒక్కో బస్సుకు రూ.14,000 వరకు చెల్లించింది. ఈసారి దాదాపుగా 3,000 బస్సులు ఈసీ కోరవచ్చని ఆర్టీసీ అధికారుల అంచనా. ఐదేళ్ల కాలంలో నిర్వహణ వ్యయం, డీజిల్‌ ధరలు పెరగడంతో ఆర్టీసీ ఈసారి బస్సుల అద్దెను రూ.21వేలుగా నిర్ణయించింది. ఆర్టీసీ ప్రతిపాదనకు ఎన్నికల సంఘం సీఈఓ ఆమోదం తెలిపారు. సంబంధిత ఫైల్‌ను ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌కే జోషికి పంపారు. తొలిదశలో 2,300 బస్సులు ఇవ్వడానికి ఆర్టీసీ అంగీకరించింది. ఇప్పటివరకు దాదాపు 69 నియోజకవర్గాలకు బస్సులు కావాలని ఎన్నికల సంఘం కోరింది. 50 నియోజకవర్గాలకు సంబంధిం చి ఆర్డర్‌ రావాల్సి ఉంది. దీంతో మరో 700 బస్సులకుపైగా ఆర్డర్‌ రావచ్చని ఆర్టీసీ భావిస్తోంది.

నేడో రేపో జీవో..
ఆర్టీసీ నిర్ణయించిన ధరకు ఎన్నికల సంఘం సమ్మతించిన నేపథ్యంలో నేడో రేపో దీనిపై అధికారిక జీవో విడుదల కానుంది. డిసెంబర్‌ 7న ఎన్నికల రోజు చేపడుతోన్న ఈ అడిషనల్‌ టాస్క్‌ నేపథ్యంలో ఆర్టీసీ కలెక్షన్లు పెరగవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో వచ్చిన రూ.4 కోట్ల లాభం కన్నా ఈసారి రెట్టింపు కావొచ్చని అంచనా.

ఆర్టీసీలో ఎన్నికల ఎఫెక్ట్‌!
సీసీఎస్‌కు రూ.80 కోట్లు చెల్లించిన ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్‌: కొంతకాలంగా ఆర్థికంగా సతమతమవుతోన్న ఆర్టీసీ ఇపుడు క్రెడిట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ (సీసీఎస్‌) రుణాలను పూర్తిగా తీర్చింది. కార్మికుల వేతనాల కోసం తాను మళ్లించిన మొత్తం నుంచి దాదాపు రూ. 80 కోట్లను ఆర్టీసీ చెల్లించింది. ఇంతకాలం కార్మికుల నుంచి వసూలు చేసిన ఈ మొత్తాన్ని సీసీఎస్‌కు చెల్లించకుండా.. కార్మికుల వేతనాల కోసం వినియోగించింది. దీంతో జూలై 1 నుం చి కార్మికులు వివిధ అవసరాల కోసం పెట్టుకున్న దరఖాస్తులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్టీసీ యాజ మాన్యం అప్పులన్నీ చెల్లించడంతో కార్మికుల దరఖా స్తులన్నీ మంజూరైనట్లు సమాచారం. ప్రతీనెలా 3వ తేదీ వరకు వేతనాలు ఆలస్యమవుతున్న దరిమిలా ఈసారి 1వ తేదీనే వేతనాలు అందాయి.

రూ.500 కోట్లకు రూ.80 కోట్లు్ల వచ్చాయి
సీసీఎస్‌ నుంచి ఆర్టీసీ నేరుగా రూ.400 కోట్లు, మరోసారి రూ.100 కోట్లు రుణాల రూపంలో తీసుకుంద ని సీసీఎస్‌ సెక్రటరీ మహేశ్‌ తెలిపారు. రూ.500 కోట్ల బకాయిలో తాజాగా రూ.80 కోట్లు చెల్లించింద ని చెప్పారు. దీంతో జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నుంచి పెండింగ్‌లో ఉన్న కార్మికుల రుణాల దరఖాస్తులను ఆమోదించే వీలు కలిగిందని చెప్పారు.

మరిన్ని వార్తలు