ఓటుపై  కత్తుల వేట!

12 Apr, 2019 12:39 IST|Sakshi
రామచంద్రాపురం మండలం సొరకాయలపాళెంలో టీడీపీ నాయకుల వైఖరికి నిరసనగా రోడ్డుపై ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీ నాయకులు, గ్రామస్తులతో మాట్లాడుతున్న పోలీసులు

సార్వత్రిక ఎన్నికల్లో దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలు

వైఎస్సార్‌సీపీ కార్యకర్తను రాళ్లతో కొట్టి చంపిన వైనం

పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి 

రామచంద్రాపురం మండలంలో చెవిరెడ్డిని అడ్డుకున్న నేతలు 

సాక్షి విలేకరులపై పిడిగుద్దుల వర్షం

కుప్పంలో టీడీపీ, బీజేపీ కుమ్మక్కు

వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిపై దాడికి యత్నం

హడలిపోయిన ఓటర్లు

జిల్లాలో టీడీపీ నేతలు సహనం కోల్పోయారు. ఓటమి భయంతో హింసాత్మక చర్యలకు ఒడిగట్టారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారు. పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదారు. 

తంబళ్లపల్లెలో ఓ కార్యకర్తను రాళ్లతో కొట్టి, కాళ్లతో తొక్కి చంపేశారు. అడ్డొచ్చిన వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. కవరేజ్‌కు వెళ్లిన మీడియానూ వదల్లేదు. కెమెరాలు లాక్కుని, ఐడీ కార్డులు చింపేసి అరాచకం సృష్టించారు. కొందరు నేతలు క్యూల్లోకి వెళ్లి యథేచ్ఛగా ప్రచారాలు చేస్తున్నా పోలీసులు అడ్డుచెప్పకపోవడం గమనార్హం. 

సాక్షి, తిరుపతి/చిత్తూరు అర్బన్‌: జిల్లాలోని ఓటర్లలో చైతన్యం కట్టలు తెంచుకుంది. ఉదయం 6 గంటలకే పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావడం కనిపించింది. పోలింగ్‌ ప్రారంభ సమయానికే కేంద్రాల వద్ద భారీ ఎత్తున ఓటర్లు బారులు తీరారు. అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు కుట్రలకు పదునుపెట్టారు. తంబళ్లపల్లి నియోజకవర్గం పీటీఎం పరిధిలో ఆ పార్టీ నేతలు దాడులకు పూనుకున్నా రు. నియోజకవర్గంలోని అన్ని బూత్‌లలో వైఎస్సార్‌సీపీకే అనుకూలంగా ఓట్లు వేస్తుండడంతో ఒకింత అసహనానికి లోనయ్యారు.

టిసదుం జెడ్పీ హైస్కూల్‌ వద్ద ఉన్న పోలింగ్‌ బూత్‌లో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఓటర్లు కొందర్ని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వారికి అడ్డుతగిలారు. రెచ్చిపోయిన టీడీపీ నేతలు రామాపు రం గ్రామానికి చెందిన ఆర్‌సీ వెంట్రామిరెడ్డి (68), మరికొందరు కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వెంకట్రామిరెడ్డిని రాళ్లతో కొట్టి చంపేశారు.

ఎంఎస్‌ బాబుపై హత్యాయత్నం

పూతలపట్టు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంఎస్‌.బాబును హత్య చేయడానికి టీడీపీ నేతలు ప్రణాళిక రచించారు. సీఎం సామాజికవర్గానికి చెందిన పలు గ్రామాల్లో దళితులను ఓట్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. తొలుత బందార్లపల్లెలో దళితులను ఓటు వేయడానికి అగ్రవర్ణాలు అంగీకరించలేదు. దీన్ని ప్రశ్నించడానికి వెళ్లిన ఎంఎస్‌ బాబుపై అక్కడే దాడిచేసి మట్టుబెట్టాలని టీడీపీ నేతలు ప్రణాళిక రచించారు. కానీ పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో పచ్చ ముసుగు ధరిం చిన అల్లరిమూలు పారిపోయాయి. అటునుంచి ఐరాల మండలంలోని కట్టకిందపల్లెకి వెళ్లిన బాబు దళితులను ఎందుకు ఓటు వేయనివ్వడం లేదని ప్రశ్నించారు. అప్పటికే కాపుకాచిన టీడీపీ నేతలు బాబుతో పాటు ఆయన గన్‌మన్, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

గాయాలతో తప్పించుకుని వెళుతున్న బాబు వాహనాన్ని అడ్డగించి, ధ్వంసం చేశారు. ఆయన్ను కిడ్నాప్‌చేసి మామిడితోపులోకి తీసుకెళ్లిన టీడీపీ కార్యకర్తలు మారణాయుధాలతో హత్య చేయడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన అనుచరులు చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. తెల్లగుండ్లపల్లెలో వైఎస్సార్‌సీపీ ఏజెంటుగా ఉన్న బాబ్జి అనే యువకుడ్ని టీడీపీ నేతలు కొట్టుకుంటూ లాక్కొచ్చారు. దాదాపు 300 మందిని ఓట్లు వేయనివ్వకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 

రెడ్డెప్పపై దాడికి యత్నం 

కుప్పం మండలంలోని కృష్ణదాసనపల్లెలో పోలింగ్‌ సరళి పరిశీలించడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పపై టీడీపీ నాయకులు దాడి చేయడానికి ప్రయత్నిం చారు. చిత్తూరు రూరల్‌ మండలంలోని చెర్లోపల్లెలో స్థానికేతరులు ఓట్లు వేయడానికి వస్తుంటే అడిగిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ వాళ్లు రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు. 

కుప్పంలో కుట్రలు
కుప్పం నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతల కుట్రలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప పోలింగ్‌ బూత్‌ల వద్దకు రాకుండా అడ్డుకున్నారు. దళవాయికొత్తపల్లి, కృష్ణదాసనపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఇదిలావుంటే కుప్పం పరిధిలో టీడీపీ, బీజేపీ కుమ్మక్కయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఎక్కడా తన ఏజెంట్లను నియమించకుండా చంద్రబాబుకు ఓట్లు వేసేలా కృషి చేశారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కేవీబీపురం రాగిగుంట బూత్‌లో ఉన్న వైస్సార్సీపీ ఏజెంట్లను బయటకు వెళ్లాలంటూ టీడీపీ నేతలు, అధికారులు బెదిరింపులకు దిగారు.

 వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు పోలింగ్‌ బూత్‌లో ఉండకూడదట 

తిరుపతి ఎన్‌జీఓ కాలనీలోని బూత్‌ నంబర్‌ 40లో టీడీపీ ఏజెంట్లను లోపల కూర్చో బెట్టి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను రానివ్వకుండా అడ్డుకున్నారు. అదేమిటని అడిగితే లోపల స్థలం చాల్లేదని చెప్పుకొచ్చారు. తిరుపతి స్కావెంజర్స్‌ కాలనీలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. రేణిగుంట మండలం ఎస్‌ఎన్‌ పురం బూత్‌ పరిధిలో ఓటర్ల జాబితాలో ఫొటోలు లేవు. గుడిమల్లంలో పోలింగ్‌ బూత్‌ వద్ద టీడీపీ కార్యకర్తలు ప్రచారం చేయడం కనిపించింది. వైస్సార్సీపీకి ఓట్లు పడుతున్నాయని ఓ కార్యకర్త చేత ఈవీఎంని గట్టిగా ఒత్తి మిషన్‌ పనిచెయ్యకుండా చేశారు. పోలింగ్‌ ప్రారంభమయ్యేసరికి మధ్యాహ్నం ఒంటిగంట దాటింది.

ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు 

రేణిగుంట మండలం గాజులమండ్యం, నల్లపాళెం గ్రామస్తులు ఓటింగ్‌ను బహిష్కరించారు. గాజులమండ్యం పారిశ్రామికవాడ నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా రెండు గ్రామాలతో పాటు మరికొన్ని పల్లెలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనిపై ఎవ్వరూ స్పందించకపోవడంతో వారు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. తర్వాత సమస్య సర్దుమణిగింది. 

చంద్రగిరిలో తమ్ముళ్లు దాష్టీకం 

వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తారన్న నెపంతో రామచంద్రాపురం మండలానికి చెందిన దళితులను పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నారు. రావిళ్లవారిపల్లి, కమ్మపల్లి, కమ్మకండ్రిగ, టీటీకండ్రిగ, ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, గణేశ్వరపురంలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డేలేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా గ్రామంలోకి రావడానికి వీల్లేదంటూ దాడికి తెగబడ్డారు. టీడీపీ ఏజెంట్లు మినహా మిగిలిన పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను కూడా గ్రామంలోకి అడుగుపెట్టనివ్వకపోవడం గమనార్హం.

కవరేజ్‌ కోసం వెళ్లిన సాక్షి విలేకరులు ప్రకాష్, శివశంకర్, రాజారెడ్డి, మరో ఫొటోగ్రాఫర్‌ను అడ్డుకున్నారు. సాక్షి విలేకరి శివశంకర్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇతని వద్ద, రాజారెడ్డి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, ఐడీ కార్డులను లాక్కుని తరిమారు. సొరకాయలపాళెం గ్రామానికి చెందిన ఇరువర్గాల వారు రాళ్లు, రప్పలు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మండల పరిధిలోని అనేక గ్రామాల్లో టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పాకాల మండలంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని భాస్కరనాయుడుపై చేయిచేసుకున్నారు. తమ్ములగుంటలో పులివర్తి నాని భార్య హల్‌చల్‌ చేశారు. 

మొరాయించిన ఈవీఎంలు

జల్లా వ్యాప్తంగా సుమా రు 2,350 ఈవీఎంలు మొరాయించినట్లు అధికారులు వెళ్లడించా రు. వీటిని సకాలంలో సరిచేయడంతో సమస్య తప్పినట్లయింది.   
 

మరిన్ని వార్తలు