శేషన్‌కు ముందు ..తరువాత

26 Mar, 2019 11:38 IST|Sakshi
టీఎన్‌ శేషన్‌

సాక్షి, మహబూబ్‌నగర్‌ : గ్రామస్థాయిలో పంచాయతీ ఎన్నికలు మొదలుకొని దేశస్థాయిలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల వరకు పదుల సంఖ్యలో వాహన శ్రేణులు, రాత్రింభవళ్లు తేడా లేకుండా హోరెత్తించే ప్రచారాలు, లౌడ్‌ స్పీకర్ల హోరు, గోడలపై రాతలు, గుట్టలు గుట్టలుగా తమ నేతలను బలపరుస్తూ ప్రచార పత్రాలు ఇదంతా 1990కి ముందు ఎన్నికలు జరిగే తీరు.

ఎన్నికలంటే శేషన్‌కు ముందు.. శేషన్‌కు తర్వాత అన్నంతగా ఎన్నికల నిర్వహణలో మార్పులు చేస్తూ అప్పట్లో హుకూం జారీ చేసి పోటీల్లో నిలిచే అభ్యర్థుల పట్ల సింహస్వప్నంలా మారి నిబంధనల కొరడా ఝులిపించారు. ప్రస్తుతం వీటన్నింటికి కళ్లెం వేసి అభ్యర్థుల హంగామాకు, ఎన్నికల ఖర్చుకు ముకుతాడు వేసిన ఘనత 1990 నుంచి 1996 వరకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన టీఎన్‌ శేషన్‌కే దక్కుతుంది.

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి ఎన్నికల వ్యయానికి జమ, ఖర్చు చెప్పాలని, నిర్ణీత పరిమితికి మించి ఖర్చు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రచారంలో వినియోగించే వాహనాల ఖర్చు, కార్యకర్తల భోజనాల వ్యయం, పార్టీ ప్రచార ఖర్చు కట్టుదిట్టం చేశారు. వాహనాలకు జెండా కట్టాలంటే, మైక్‌ పెట్టాలంటే అనుమతి తప్పనిసరి చేశారు. ప్రచారంలో సమయ పాలన, ప్రత్యేకించి రాత్రి సమయాల్లో లౌడ్‌ స్పీకర్ల హోరెత్తించే ప్రచారం, గోడలపై రాతలు కట్టుదిట్టం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు