సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ నేత, అపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో గుబాళించేది గులాబీ జెండాయే అన్నారు. కేసీఆర్ హామీ ఇస్తే అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని ఈటల అన్నారు. టీఆర్ఎస్ పథకాలు కుల,మతాలకు అతీతమైనవన్నారు.
దొడ్డిదారిన అధికారంలోకి రావాలనుకునేవారు కులాల ప్రస్తావన తెస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ చెప్పింది చేసింది కనుక ప్రజలు తమ పార్టీని నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ యావ, ధ్యాస అంతా తెలంగాణ అభివృద్ధిపైనే అని ఈటల స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఉద్యమం జరిగందని, వాటిని కేసీఆర్ నెరవేర్చారన్నారు. నిరుద్యోగులకు మరింత మేలు ఎలా చేయాలనేది పార్టీ ఆలోచిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ఆత్మగౌరవంతో, సంతోషంతో బతికేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈటన పేర్కొన్నారు.