సాక్షి, గుంటూరు : ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మంగళగిరి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రారంభమై రెండున్నర గంటలు అయినా ఇంకా పలు బూత్ ల్లో పోలింగ్ ప్రారంభం కాకపోవటం పై అసహనం వ్యక్తం చేసారు. అనేక మంది ఓటర్లు చాలా సేపు నిరీక్షించి తిరిగి వెనక్కు మళ్ళుతున్నారు.
ఈవీఎంలు పనిచేయకపోవడంపై ఆర్కే ఎన్నికల అధికారులను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అధికారుల తీరుకు నిరసనగా ఆర్కే ధర్నాకు దిగారు. నియోజకవర్గంలోని దాదాపు 60 ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కొని చోట్ల ఇప్పటి వరకు పోలింగ్ మొదలు కాలేదన్నారు. ఎండకు తట్టుకోలేక ముందుగానే ఓటు వేద్దామని వచ్చిన ఓటర్లు ఈవీఎంలు పనిచేయకోవడంతో వెనుతిరిగి పోతున్నారన్నారు. మాక్ పోలింగ్ సమయంలో పనిచేసిన ఈవీఎంలు ఇప్పుడు పనిచేయకకోవడం పట్ల అనుమానాలు ఉన్నాయన్నారు. వైఎస్సా సీపీకి ఓట్లు పడే చోట ఈవీఎంలు పనిచేయకుండా చేశారని ఆరోపించారు. లోకేష్ ఓడిపోతారనే ఉద్దేశ్యంతోనే ఈవీఎంలు పనిచేయకుండా చేస్తున్నారనే అనుమానం ఉందన్నారు. అధికారుల తీరు పై ఆర్కే తో పాటుగా ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండకు తట్టుకోలేక ఉదయాన్నే ఓటు వేద్దామని వస్తే ఇప్పటి వరకు బయటటే నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేయడానికి వస్తే ఈవీఎంలు పనిచేయడం లేదంటే ఎలా అని ప్రశ్నించారు.