రాహుల్, మోదీల మధ్యే పోరు

20 Feb, 2019 01:50 IST|Sakshi

లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

ఢిల్లీలో ఏఐసీసీ పబ్లిసిటీ కమిటీ భేటీ

హాజరైన ఉత్తమ్, రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి

సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీకి, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీకి మధ్యే పోరు జరగనుందని టీకాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీనే దేశంలో సుస్థిరమైన పాలన అందించగలదన్నారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏఐసీసీ పబ్లిసిటీ కమిటీ అన్ని రాష్ట్రాల కమిటీలతో మంగళవారం ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌ ఆనంద్‌ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా పాల్గొన్నారు. దీనికి రాష్ట్రం నుంచి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, క్యాంపెయిన్‌ కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి హాజరయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో పబ్లిసిటీ కమిటీలు ఏ విధం గా ప్రజల్లోకెళ్లాలి అన్న విషయాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. 

రాహుల్‌.. దేశ భవిష్యత్తు: రాజగోపాల్‌రెడ్డి
సమావేశం అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. లౌకికంగా కాంగ్రెస్‌ దేశాన్ని ఏ విధంగా కాపాడిందన్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీనే దేశానికి మెరుగైన పాలన అందించగలుగుతుందని, రాహుల్‌ గాంధీ దేశ భవిష్యత్తు అని.. రాష్ట్ర అభివృద్ధి కూడా కాంగ్రెస్‌ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. 

త్వరలో నిర్ణయిస్తాం: విజయశాంతి
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి రాబోయే రోజుల్లో పబ్లిసిటీ, క్యాంపెయిన్‌ కమిటీల పాత్ర ఎలా ఉండాలన్న దానిపై ఈ భేటీలో చర్చించినట్లు విజయశాంతి చెప్పారు. ఎన్నికల ప్రచారాన్ని ఎప్పట్నుంచి ప్రారం భించాలన్న దానిని త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు లోక్‌సభ ఎన్నికలకు తేడా ఉం టుందని.. ఈ ఎన్నికలు ప్రధాని మోదీకి, రాహుల్‌ గాంధీకి మధ్య జరిగే యుద్ధమన్నారు.

మరిన్ని వార్తలు