దాణా కుంభకోణం కేసులో సంచలన తీర్పు

23 Dec, 2017 15:50 IST|Sakshi

రాంచీ : దాణా కుంభకోణం కేసులో బిహార్‌ బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో  లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను దోషిగా తేల్చుతూ రాంచీలోని సీబీఐ స్పెషల్‌ కోర్టు శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడే క్రమంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తన కొడుకు తేజస్వి యాదవ్‌తో కలిసి కోర్టుకు హాజరయ్యారు. ఆర్జేడీ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున్న కోర్టు వచ్చారు.

రెండు దశాబ్దాల అనంతరం ఈ కేసుపై నేడు సీబీఐ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అయితే బిహార్‌ మరో మాజీ సీఎం జగన్నాథ్‌ మిశ్రను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. జగన్నాథ్‌ మిశ్రాతో పాటు ఏడుగురిని నిర్దోషులు ప్రకటించగా.. లాలూతో సహా 15 మందిని దోషులుగా తేల్చింది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను కోర్టులోనే అరెస్ట్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. రాంచీ జైలుకు ఆయన్ను తరలించనున్నారు. జనవరి 3న లాలూకు శిక్ష ఖరారు చేయనున్నారు. 2013లో ఓ కేసులో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష పడగా.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు పడింది. ఇప్పటికే అనర్హత వేటు ఎదుర్కొంటున్న లాలూకు ఈ తీర్పు మరింత ప్రతికూలంగా మారింది. 

1991-96 కాలంలో దియోగఢ్‌(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.84.5 లక్షలకుపైగా అక్రమంగా డ్రాచేసినట్లు బిహార్‌ మాజీ సీఎంలు లాలూ, జగన్నాథ మిశ్రాలతో సహా 22 మందిపై సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది. 1997, అక్టోబర్‌ 27న దీనిపై సీబీఐ చార్జిషీట్‌ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు.

మరిన్ని వార్తలు