చింతమనేనికి ఇక చింతే...

13 Sep, 2019 10:57 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు) : ఇప్పటివరకూ జనాలను పీడించిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఇక చింతలు మొదలైనట్టే. గత ఐదేళ్లలో ఆయన చేయని అక్రమాలు లేవు. దెందులూరు నియోజకవర్గంలో రౌడీరాజ్యాన్ని స్థాపించారు. ఏది  చేసినా అంతా నా ఇష్టం.. అనే రీతిలో నియంతలా చట్టానికి అతీతుడిలా వ్యహరిస్తూ వచ్చారు. నియోజకవర్గంలో ఏ ఊరు చూసినా అతని అరాచకాల బాధితులు ఉంటారు.  తన ఇలాకాలో నోరెత్తితే.. ఇక వారి బాధలు వర్ణనాతీతమన్నట్టు.. తాను మాట్లాడిందే, చేసిందే చట్టంలా చింతమనేని వ్యవహరించారు. ఇళ్లు కూలగొట్టటం, భూములు ఆక్రమణ, న్యాయం కోసం వచ్చిన వారిపై దౌర్జన్యం, చివరికి వికలాంగులు, వృద్ధులను, కార్మికులనూ కొట్టిన సందర్భాలు కోకొల్లలు. ఈ రౌడీరాజ్యాన్ని భరించలేని ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఆయనకు ఓటు అనే ఆయుధంతో  బుద్ధిచెప్పారు.

కౌంట్‌డౌన్‌ మొదలు 
చింతమనేనికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఓడిపోయిన తర్వాత కూడా తన పంథా మార్చుకోని ఆయన అరాచకాలపై పోలీసుల్లో కదలిక వచ్చింది. కేసు నమోదు చేయగానే పరారైన చింతమనేని కోసం పోలీసులు వేట ప్రారంభించారు. అతని అరాచకాల చిట్టాను బయటకు తీశారు. దెందులూరు నియోజకవర్గంలో అతను చేసిన అక్రమాలను వెలికితీస్తూ, బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇక చింతమనేని అండ చూసుకుని సామాన్య ప్రజలను అష్టకష్టాల పాల్జేసిన∙ఆయన అనుచరులు, వర్గీయులపైనా దృష్టి సారించారు. ఇసుక మాఫియా, మట్టి , గ్రావెల్‌ను అక్రమంగా దోచుకుతింటూనే.. భూకబ్జాలు, దాడులు, దౌర్జన్యాలు ఇలా అనేక రకాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వారిపై  కేసులు నమోదవుతున్నాయి. కేసుల్లో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు బాధితులకు న్యాయం చేసే దిశగా దూసుకుపోతున్నారు. 

చింతమనేని అనుచరుల అరెస్టుల పర్వం  
చింతమనేని అరాచకాల చిట్టా బయటపడుతోంది అతని అరాచకాల్లో భాగస్వాములైన అనుచరులను పోలీసులు వేటాడుతున్నారు. పలు కేసుల్లో చింతమనేనితోపాటు,  భాగస్వాములైనవారిపై పోలీసులు గురిపెట్టారు. దుగ్గిరాల గ్రామంలో చింతమనేనిని అరెస్టు చేసేందుకు బుధవారం పోలీసులు భారీఎత్తున మోహరించారు. ఈ సందర్భంలో  విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లను చింతమనేని అనుచరులు నిర్బంధించి, గేటుకు తాళాలు వేసి బెదిరించారు. దీనిపై  మహిళా కానిస్టేబుల్‌ గుమ్మడి మేరీ గ్రేస్‌ ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీటౌన్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో త్రీటౌన్‌ పోలీసులు నలుగురు చింతమనేని అనుచరులను అరెస్టు చేశారు. వీరిలో జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న దుగ్గిరాలకు చెందిన చింతమనేని విష్ణు, ధర్మాజీగూడెంకు చెందిన వేం పాటి ప్రసాద్, ఏలూరుకు చెందిన న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్, పెదవేగి మాజీ ఎంపీపీ దేవరపల్లి బక్కయ్య ఉన్నారు. 

పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు
చింతమనేనిపై 1995లోనే ఏలూరులో రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. అప్పటి నుంచీ సుమారు 62 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఏలూరు త్రీటౌన్, టూటౌన్, వన్‌టౌన్, రూరల్‌తోపాటు, పెదవేగి, పెదపాడు, గన్నవరం, ముసునూరు, కైకలూరు పోలీసుస్టేషన్లలో సుమారు 40 కేసులు నమోదయ్యా యి. తాజాగా మరో 20 మందికిపైగా బాధితులు రోజూ ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలు స్తోంది. తాజాగా ఫిర్యాదు చేసిన బాధితులంతా గతంలో కేసులు పెట్టినా న్యాయం జరగకపోవటంతో మరోసారి పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు