ఆర్‌ఈసీఎస్‌ ఉద్యోగుల్లో కలవరం..!

5 Apr, 2019 08:05 IST|Sakshi
మలసాల ధనమ్మ

టీడీపీకి ఓటేయాలని సిబ్బందిపై జెడ్పీటీసీ ఒత్తిడి 

సంస్థ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆందోళన

సాక్షి, అనకాపల్లి: : టీడీపీని ఇంటికి సాగనంపడానికి స్పష్టమైన ప్రజాతీర్పు వెలువడనుందనే సంకేతాల నేపథ్యంలో.. పచ్చ నేతల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘం (ఆర్‌ఈసీఎస్‌) ఉద్యోగులను సంఘ మాజీ పర్సన్‌ ఇన్‌చార్జి సతీమణి, టీడీపీ జడ్పీటీసీ ధనమ్మ బెదిరింపులకు గురిచేశారు. వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ..టీడీపీకి ఓటేయకుంటే ఉద్యోగాలు పీకేస్తామని హెచ్చరించారు. గురువారం ఎన్నికల ప్రచారం చేపట్టిన ధనమ్మ ఆర్‌ఈసీఎస్‌ సిబ్బంది అంతా అధికార టీడీపీకి ఓటు వేయాలని ఒత్తిడి చేశారు. ‘మీరంతా ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తున్నట్టు తెలిసింది. రానున్నది టీడీపీ ప్రభుత్వమే. మా పార్టీకే ఓటు వేయాలి’ అంటూ బెదిరించే ధోరణిలో మాట్లాడినట్టు సమాచారం.

ఈ పరిణామంతో ఉద్యోగులు కలవరం చెందుతున్నారు. ధనమ్మ బెదిరింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు..‘మమ్మల్ని వదిలేయండి. మాకు నచ్చినవారికి ఓటేస్తాం’ అని స్పష్టం చేశారు. జెడ్పీటీసీ తీరు బాగోలేదని సంఘ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు పరదేశినాయుడు పేర్కొన్నారు. ఇలా బెదిరించడం సమంజసం కాదని, ప్రజాస్వామ్యంలో నచ్చిన వారికి ఓటు వేసుకోవచ్చన్నారు. సంస్థ ఉద్యోగులకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. వినియోగదారులకు సేవలందించడమే తమ ధ్యేయమన్నారు. ఇదే విషయాన్ని జెడ్పీటీసీ ధనమ్మ వద్ద ప్రస్తావించగా సంఘ వినియోగదారునిగా తాను విద్యుత్‌ కనెక్షన్‌ కోసం అధికారులతో మాట్లాడటానికి మాత్రమే వెళ్లానని పేర్కొన్నారు. జడ్పీటీసీ తీరుపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు