పోటాపోటీగా.. 

26 Apr, 2019 11:53 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: పరిషత్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటాపోటీగా నామినేషన్లు వేశారు. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఊహించని విధంగా భారీ స్థాయిలో దాఖలయ్యాయి. ఒక్కో స్థానం నుంచి ఇద్దరు నుంచి ఆరుగురి వరకు నామినేషన్లు వేశారు. జిల్లాలో తొలి విడతలో టీఆర్‌ఎస్‌ ,కాంగ్రెస్‌ పార్టీల్లోనే పోటా పోటీగా నామినేషన్లువేశారు. ఐదు జెడ్పీటీసీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ నుంచి 18 మంది, కాంగ్రెస్‌ నుంచి 12 మంది నామినేషన్లు వేశారు. ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. అధికార పార్టీలో ఎమ్మెల్యేలకే అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను రాష్ట్ర పార్టీ అప్పగించడంతో తలనొప్పిగా మారింది. ఎవరికి ఇవ్వాలని ఆలోచనలో పడ్డారు. అధికార పార్టీలో ఎక్కువ మంది టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సైతం పోటీ ఉంది.

అధికార పార్టీలో పోటా పోటీ
అధికార పార్టీలో పోటా పోటీగా నామినేషన్లు వేశారు. పర్వతగిరి జెడ్పీటీసీ స్థానానికి 9 మంది నామినేషన్‌లు వేయగా అందులో ఆరుగురు టీఆర్‌ఎస్‌కు చెందినవారే ఉన్నారు. మూడు అంజీనాయక్, బానోత్‌ సింగులాల్, విజేందర్, చక్రం, బానోత్‌ స్వరూప, గుగులోత్‌ కిషన్‌లు నామినేషన్లు వేశారు. నర్సంపేట జెడ్పీటీసీగా 11 మంది నామినేషన్లు వేయగా అందులో టీఆర్‌ఎస్‌ పార్టీ వారే ఐదుగురు ఉన్నారు. ఈర్ల రాణి, కోమండ్ల జయమ్మ, మచ్చిక వరలక్ష్మీ, బీరం మణెమ్మ, ముత్తినేని రమలు నామినేషన్‌ వేశారు. దుగ్గొండి జెడ్పీటీసీగా ఆకుల శ్రీనివాస్, రాజ్‌కుమార్, పొన్నం మొగిళిలు నామినేషన్‌ వేశారు. సంగెం నుంచి ఒక్కరు మాత్రమే గుడ సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. వర్ధన్నపేట జెడ్పీటీసీగా మార్గం భిక్షపతి, కౌసల్య, వెంకటమ్మలు నామినేషన్‌ వేశారు.

కాంగ్రెస్‌ పార్టీలో ..
కాంగ్రెస్‌ పార్టీ నుంచి 12 మంది నామినేషన్లు వేశారు. దుగ్గొండి జెడ్పీటీసీగా వలస రాంమూర్తి, వేముల ఇంద్రదేవ్, నర్సంపేట నుంచి బాబ్బుల అరుణ, బానోత్‌ ధర్జీ, గుజ్జుల పద్మ, పర్వతగిరి నుంచి జాటోత్‌ శ్రీనివాస్, శ్రీనివాస్‌ నాయక్, సంగెం నుంచి తీగల రవీందర్‌గౌడ్, జనగాం రమేశ్, మాధవరెడ్డి, అంజన్‌రావు , వర్ధన్నపేట నుంచి గుగులోత్‌ పృథ్వీరాజ్, వెంకన్న, సత్యనారయణలు నామినేషన్లు వేశారు.

మొదలైన బుజ్జగింపుల పర్వం..
ఒకే పార్టీ నుంచి ఒక్కరి కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో పోటీ నుంచి తప్పించడానికి నేతలు రంగంలోకి దిగారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ నుంచి ఒక్కరే అభ్యర్థి రంగంలో ఉండే విధంగా పావులు కదుపుతున్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులను ఉపసంహరణ చేసే విధంగా బుజ్జగింపులకు శ్రీకారం చుట్టారు. మెజార్టీ స్థానాలు గెలుచుకునే విధంగా సహకరించడం కోసం పోటీ నుంచి తప్పుకోవాలని సూచిస్తున్నారు. బుజ్జగింపులతోపాటు తాయిలాలను అందిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో అవకాశం కల్పిస్తామని భరోసా కల్పిస్తున్నారు. ఏ పార్టీ బుజ్జగింపులు ఏ మేరకు ఫలిస్తాయో మాత్రం ఈ నెల 28న ఉపసంహరణతో తేలిపోతుంది.

వర్ధన్నపేట బరిలో లేని టీడీపీ
ఒకప్పుడు టీడీపీ కంచుకోట వర్ధన్నపేట. ప్రసు ్తతం జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అభ్యర్థి కరువయ్యారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల్లో పోటాపోటీగా నామినేషన్లు వేశారు. టీడీపీ మా త్రం అభ్యర్థులు కరువయ్యారు. మిగతా మండలాల్లో ఒక్కొక్కరు నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసిన వారు సైతం బరిలో ఉంటారో ఉపసంహరించుకుంటారో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు