ఆ లేఖ అందింది: కిషన్‌రెడ్డి

21 Mar, 2020 03:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లు తన వద్ద సమాచారం ఉందని ఆ శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆ లేఖ హోంశాఖ కార్యదర్శికి అందింది. హోంశాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. ఆ వివరాలు నేను కూడా తెలుసుకుంటున్నా. ఏపీ ఎన్నికల కమిషనర్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. అక్కడ తగినంత భద్రత ఉంది. ఆయన ఏపీ ఎప్పుడు వెళ్లినా పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని సీఎస్‌ను కోరాం. అవసరమైతే ఈమేరకు లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇస్తాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంతర్గత విషయం’ అని పేర్కొన్నారు. లేఖ ఆయనే రాశారా? అని మీడియా ప్రశ్నించగా  ‘మాకు తెలిసినంతవరకు ఆయనే (ఎస్‌ఈసీ) రాసినట్లు సమాచారం ఉంది’ అని బదులిచ్చారు.

>
మరిన్ని వార్తలు